హేట్ స్పీచ్ మీద బ్యాన్

by Disha edit |
హేట్ స్పీచ్ మీద బ్యాన్
X

ఇప్పుడు బీజేపీ ముస్లిం దేశాల నిరసనల కారణంగా ఇద్దరు ప్రతినిధుల మీద చర్యలు తీసుకోవడం, విద్వేష ప్రసంగాలు చేసేవారిని గుర్తించి హెచ్చరికలు చేయడం మంచిదే. వాట్సాప్ యూనివర్సిటీ సభ్యులకు, విద్వేష, మతోన్మాదులను కూడా ఈ విషయంలో హెచ్చరించాల్సిన అవసరం ఉంది. కాన్పూర్ హింసాత్మక సంఘటనలలో 54 మందిని అరెస్టు చేశారు. ఇక్కడ కూడా బుల్డోజర్ల భయం నెలకొంది. అన్యాయంగా అరెస్ట్ చేసారని నిరుపేదలు వాపోతున్నారు. ధార్మిక విషయాల మీదనే ఎక్కువగా టీవీలలో డిబేట్లు కొనసాగుతున్నాయి. ఒక మహంత్, ఒక ముల్లా ఇందులో తప్పనిసరిగా ఉంటారు. యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇదే ఎక్కువ. సంపాదకవర్గం డిబేట్‌లో వీరు మాట్లాడే విషయాలకు భాద్యత వహించదు. అధిక ధరలు, నిరుద్యోగం, అసమానతలు, ఆకలి మీద డిబేట్‌లు తక్కువే. ధార్మిక విషయాలలో జనాలను తప్పుదారి పట్టించేలా జరిగే డిబేట్‌ల మీద హయ్యర్ లీడర్‌షిప్ మౌనం వహిస్తూ ఉంటారు. ముందుగా ఈ డిబేట్‌లను బ్యాన్ చేయాలి.

భారతదేశంలో హేట్ స్పీచ్ మీద బ్యాన్ పెట్టాల్సిన సమయం వచ్చేసిందని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో దాదాపు 200 కోట్ల దాకా ఉన్న ముస్లింలు ఆరాధించే ప్రవక్త ముహమ్మద్ మీద బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల భారం కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ మీద తీవ్రంగా పడింది. ముస్లిం దేశాలలో మన దేశం ఉత్పత్తులను బహిష్కరించే పరిస్థితి వచ్చింది. తప్పు చేసింది బీజేపీ ప్రతినిధులు అయితే, మొత్తం దేశమే క్షమాపణ కోరాలని కువైట్, ఖతర్‌లాంటి పది దేశాలు కోరాయి. దీనితోపాటు దేశంలో బీజేపీ. సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్ మతపరంగా చేస్తున్న వ్యాఖ్యలు, మనుషులను, మనసులను విడదీసే రాజకీయాలు, 80-20 లాంటి విద్వేష ప్రసంగాల వంటితో కూడా మన దేశం అపవాదును మూటగట్టుకోవలసి వచ్చింది.

బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో నిరుద్యోగం, పేదరికం, అసమానతలు గత 40 ఏండ్లలో ఎన్నడూలేని విధంగా పెరిగిపోయాయి. అమ్మకాలు, ప్రైవేటీకరణ, మానిటైజేషన్, లీజుకు ఇవ్వడం తదితర కారణాలతో ప్రభుత్వ రంగం దాదాపుగా కుదేలైపోయింది. రెండు కోట్ల మంది వరకు ఉపాధి కోల్పోయారు. యేటా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లే పరిస్థితి. అందులో అమెరికా, కెనడా తర్వాత ముస్లిం కంట్రీలకు ఐదు లక్షల మంది వెళ్తున్నారు. దాదాపు 85 లక్షల మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులు విదేశాలలో పని చేస్తున్నారు. వారితో 114 బిలియన్ డాలర్ల వ్యాపార లావాదేవీలు ముడిపడి ఉన్నాయి. 11 శాతం వ్యాపార రంగం, దిగుమతులు, ఎగుమతులు ఆధారపడి ఉన్నాయి. యూఏఈలో, గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా కువైట్, ఖతర్, సౌదీ, ఒమాన్‌లాంటి చోట సెటిల్ అయిన భారతీయులు తక్కువేమీ లేరు. వారి సంఖ్య 30 లక్షల పైమాటే అంటున్నారు.

స్వరం మారుతున్నదా?

ఈ నేపథ్యంలో తమ ప్రతినిధులు ముహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇస్లామిక్ దేశాలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేయడం, భారత రాయబారులను పిలిపించుకుని వివరణ కోరడంతో అప్రమత్తం అయిన బీజేపీ వెంటనే నష్ట నివారణకు దిగింది. అభ్యంతరకరంగా మాట్లాడిన నుపూర్‌శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నవీన్‌ జిందాల్‌ను బహిష్కరించింది. హేట్ స్పీచ్ ఇచ్చే 38 మంది పేర్లతో జాబితా తయారు చేసి ఆంక్షలు విధించింది.

మతపరంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వవద్దని, పార్టీకి తెలియకుండా డిబేట్‌లకు, మీటింగ్‌లకు వెళ్లవద్దని ఆదేశించింది. ఇందులో తెలంగాణ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉంది. ఈయనతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ముస్లింలను టార్గెట్ చేసుకుని రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. బీజేపీ ఇపుడు నుపూర్, నవీన్‌ను 'ఫ్రింజ్ ఎలిమెంట్స్' అంటున్నది. ఇలాంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు ఇంకా ఉన్నారు. 'ఏనుగుకు తినే పండ్లు, బయటికి కనిపించే పండ్లు వేరు వేరుగా ఉంటాయి' ప్రస్తుతం బీజేపీ నేతల మాటలూ అలాగే ఉన్నాయి. 38 మంది 5,200 హేట్ స్పీచెస్ ఇచ్చారంటున్నారు. అనంతకుమార్, గిరిరాజ్ సింగ్, సాక్షి మహారాజ్, ప్రజ్ఞా ఠాకూర్, రాజాసింగ్ తదితరులు ఇందులో ఉన్నారు.

వీటిని మరువగలమా?

ప్రజ్ఞా ఠాగూర్ 2019 లో మహాత్మా గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పీఎం నరేంద్ర మోదీ 'నేను ప్రజ్ఞాను ఎన్నటికీ మనస్ఫూర్తిగా క్షమించను' అన్నారు. అయినా ఆ తర్వాత కూడా ఆమె గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడు అని పొగిడారు. స్వాతంత్రం కోసం గాంధీ పోరాటం చేయలేదని, పోరాడినట్లు నాటకాలు ఆడారని అనంత హెగ్డే అనే మాజీ మంత్రి అన్నారు. హిందూ అమ్మాయిని ఎవరైనా తాకితే ఆ చేయిని నరికేస్తామని కూడా అన్నారు. మరో ఎంపీ రాజ్యాంగం మార్చేయాలన్నారు.

బీజేపీలో ఉన్న యూపీ మంత్రి షానవాజ్ హుస్సేన్ భార్య, కేంద్రంలో గతంలో మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ భార్య ఇద్దరూ హిందువులే కావడం విశేషం. ఢిల్లీలోని జామా మసీదును కూలగొట్టాలని 2018-19లో సాక్షి మహారాజ్ డిమాండ్ చేశారు. యూపీ‌లో సంగీత్ సోమ్ జ్ఞాన్‌వాపీ మసీదుపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 'దేశ్‌కే గద్దారోంకో-గోలి మారో సాలోంకో' అని చేసిన వ్యాఖ్యలు, 'రామ్ మందిర్ వ్యతిరేకుల తలలు నరికేస్తాం' అన్న ఒక ఎమ్మెల్యే మాటలు ఎలా మరిచిపోగలం.

వాటి మీదా చర్యలు తీసుకోవాలి

ఈ రోజు బీజేపీ ధార్మిక రాజకీయం చెల్లే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచం కూడా చూస్తున్నది. ఇప్పటికే దేశం ఆర్థికంగా పూర్తిగా దెబ్బ తిన్నది. విశ్వగురు అయ్యే పరిస్థితేమోగానీ, దేశం ఆర్థికంగా గట్టిగా నిలదొక్కుకుంటే చాలు అనే పరిస్థితి వచ్చి పడింది. నాగపూర్‌లో ఈ నెల రెండున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ 'మసీదులలో శివలింగాలు వెతకడం మానాలి. అది మా పని కాదు' అని హితవు పలికారు. ఆయన ప్రసంగంలో ఎంతో మార్పు కనిపించింది. ఇప్పుడు బీజేపీ ముస్లిం దేశాల నిరసనల కారణంగా ఇద్దరు ప్రతినిధుల మీద చర్యలు తీసుకోవడం, విద్వేష ప్రసంగాలు చేసే వారిని గుర్తించి హెచ్చరికలు చేయడం మంచిదే. వాట్సాప్ యూనివర్సిటీ సభ్యులకు, విద్వేష, మతోన్మాదులను కూడా ఈ విషయంలో హెచ్చరించాల్సిన అవసరం ఉంది.

కాన్పూర్ హింసాత్మక సంఘటనలలో 54 మందిని అరెస్టు చేశారు. ఇక్కడ కూడా బుల్డోజర్ల భయం నెలకొంది. అన్యాయంగా అరెస్ట్ చేసారని నిరుపేదలు వాపోతున్నారు. ధార్మిక విషయాల మీదనే ఎక్కువగా టీవీలలో డిబేట్లు కొనసాగుతున్నాయి. ఒక మహంత్, ఒక ముల్లా ఇందులో తప్పనిసరిగా ఉంటారు. యూ ట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇదే ఎక్కువ. సంపాదకవర్గం డిబేట్‌లో వీరు మాట్లాడే విషయాలకు భాద్యత వహించదు. అధిక ధరలు, నిరుద్యోగం, అసమానతలు, ఆకలి మీద డిబేట్‌లు తక్కువే. ధార్మిక విషయాలలో జనాలను తప్పుదారి పట్టించేలా జరిగే డిబేట్‌ల మీద హయ్యర్ లీడర్‌షిప్ మౌనం వహిస్తూ ఉంటారు. ముందుగా ఈ డిబేట్‌లను బ్యాన్ చేయాలి. అరెస్టులు, కేసుల విషయంలో అందరికీ సమాన న్యాయం జరగాలి. 80-20 రాజకీయాలకు తావు లేదనే విధంగా దేశం తయారు కావాలి. మన భారతదేశం కుల, మతాలకు అతీతం అనే పేరును సార్థకం చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో 180 దేశాలలో ఆఖరి స్థానంలో భారత్ ఉంది. భారత్ కనీసం మనుషులలో పర్యావరణం కాపాడటానికి అయినా కృషి జరగాలి.

ఎండీ. మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223


Next Story

Most Viewed