జాతి సంపదను..కాపాడాల్సిన బాధ్యత లేదా?

by Disha edit |
జాతి సంపదను..కాపాడాల్సిన బాధ్యత లేదా?
X

ఇసుక నుండి కాసులు పిండుకొనే విద్యలో మహా ప్రావీణ్యులు వైసీపీ నాయకులు. రాష్ట్రాన్ని తవ్వి పారెయ్యడంలో వాళ్ళు ఉద్దండ పిండాలు. ఇసుక ర్యాంపుల్లో వేలాది లారీలు, వందలాది మంది కార్మికులు, పదుల సంఖ్యలో ప్రొక్లైయినర్ల ఇసుక తవ్వకాలు రాత్రింబవళ్ళు కొనసాగుతున్నాయి. లారీలు వెళ్ళేందుకు నదుల్లో ఏకంగా రోడ్లు నిర్మించారంటే అధికార పార్టీ వైసీపీ నాయకుల ఆగడాలు ఎంత తెగించాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. నదీ ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేయకూడదన్న నిబంధన ఉన్నా, దాన్ని తుంగలో తొక్కి సహజ సంపదను యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు. బకాసురుడి ఆకలి అయినా తీరుతుందేమో కానీ అధికార పార్టీ నాయకుల ధన దాహం తీరేటట్లు లేదు. ధన దాహంతో భవిష్యత్‌ను తవ్వేస్తున్నారు. విచ్చలవిడి ఇసుల తవ్వకాలు భావితరాల అవసరాలకు, జల సంక్షోభానికి, పర్యావరణ విఘాతానికి ప్రధాన కారణం కాబోతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారు.

ఏడాదికి 10వేల కోట్ల వ్యాపారం!

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి,పెన్నానదులలో కాక చిన్న, చిన్న ఉపనదుల్లో ఏళ్ల తరబడి కొండలు వలే, గుట్టలు వలె పడివున్న ఇసుకను వేలాది లారీలతో కొల్లగొట్టేస్తున్నారు. జలవనరుల పరిరక్షణ చట్టాలు, నిబంధనలు ఎన్ని వున్నా ఆ నిబంధనలు ఉల్లంఘించి మరీ తవ్వేస్తున్నారు.1-2 మీటర్లు లోతు కన్నా ఎక్కువ తీయకూడదు. కానీ ఇసుక ఎంత లోతు ఉంటే అంత లోతు తవ్వేస్తున్నారు. కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాలలో వున్న ఇసుక ర్యాంపులు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇసుక మాఫియా బరితెగించి ఇసుకను తరలిస్తున్న పద్దతిని చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కృష్ణా నదికి అడ్డంగా పెద్ద,పెద్ద తూములు వేసి కృష్ణా నదిలో రోడ్డు నిర్మించారు. దీనిని బట్టి ఇసుక మాఫియా ఎంత యథేచ్ఛగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నదో అర్ధం అవుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చడంతో ఇసుక మాఫియా రాష్ట్ర భవిష్యత్ తవ్వి పారేస్తుంది. అనుమతి 2 కోట్ల టన్నులు ఉంటే, 6 కోట్ల టన్నుల వరకు తవ్వుతున్నారు.ఈ ఏడాదికి రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్లు సమాచారం. జగన్ నాలుగేళ్లలో 3 సార్లు ఇసుక పాలసీలు మార్చారు. తెలుగుదేశం హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ 1500 ఉండగా జగన్ హయాలో ట్రాక్టర్ రూ 5000 వేలకు చేరింది.

ఇసుక దోపిడికి లాకులెత్తేశారు

రాష్ట్రంలో జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో అధికార పార్టీ పెద్దలు యథేచ్చగా సాగిస్తున్న ఇసుక దోపిడీకి కారణం జేపీ వెంచర్స్‌ కాదని, ఆ సంస్థే అధికారికంగా స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలిపినట్లు సమాచారం. ఇసుక తవ్వేది తాను కాదని, విక్రయించేదీ కూడా తాను కాదని ఆ సంస్థ చెబుతోంది. ఇసుక రేవుల్లో బిల్లులు మాత్రం జేపీ సంస్థ పేరుతో జారీ అవుతున్నాయి. ఈ పని వేరే వాళ్లు సబ్‌ కంట్రాక్ట్‌ తీసుకొన్నారని జేపీ సంస్థ చెపుతోంది. అధికారికంగా సబ్‌ కంట్రాక్ట్‌ వేరే వాళ్లకు ఇచ్చినప్పుడు బిల్లులు మాత్రం జేపీ పేరుతో ఇవ్వడం ఏమిటి? జేపీ సంస్థ ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక బొక్కుతున్నట్లు బట్టబయలైంది. రాష్ట్రంలో ఇసుక పేరుతో జరుగుతున్న దోపిడీ భాగోతాన్ని జేపీ సంస్థ నివేదిక బట్టబయలు చేసింది. రాష్ట్రంలో ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 40 వేల కోట్ల మేర ఇసుకను రేవుల్లో తవ్వి విక్రయించినట్లు సమాచారం. ప్రభుత్వానికి మాత్రం చిల్లర చెల్లించి ఇసుకాసురులు కనక రాశులు పోసుకుంటున్నారు. దీనిపై చంద్రబాబు ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుంది అంటూ ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ఇసుక దోపిడీకి లాకులెత్తారు. ఇసుక దొరకకుండా చేసి 40 లక్షల మంది భవన నిర్మాణరంగ కార్మికుల పొట్టగొట్టారు.

ఎన్జీటీ ఆదేశాలనూ ధిక్కరించి..

ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నిగ్గుతేల్చేందుకు ఎన్‌జిటీ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇసుక తవ్వకాల్లో హెవీ మిషనరీ ఉపయోగించరాదన్న ఎన్జీటీ ఉత్తర్వులను పక్కనపెట్టి గోదావరి, కృష్ణా నదుల్లో డ్రెడ్జర్లు ఉపయోగించి తవ్వకాలు సాగించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లలో సెమీ మెకనైజ్డ్ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. కానీ రాజ్యాంగబద్ద సంస్థ ఎన్జీటీ ఆదేశాలు, కోర్టుల ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ పెద్దల అండతో ఇసుక మాఫియా చెలరేగిపోతున్న తీరు చూస్తే చట్టాలు, నిబంధనలు వైసీపీ నాయకులకు వర్తించవా అన్న రీతిగా వుంది. జెపి పవర్ వెంచర్స్ సంస్థను గుత్తెదారుగా చూపించి ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోంది. భూమిలో 3-4 మీటర్ల లోతువరకు ఇసుక తవ్వుతున్నారు. ఒక్కొక్క లారీలో 35 నుండి 40 టన్నుల వరకు ఇసుక లోడు చేస్తూ.. రోజు కొన్ని లక్షల టన్నుల ఇసుకను వేల లారీలు, ట్రాక్టర్లతో దోచుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో అవసరాల కోసం వివిధ జిల్లాలలో లక్షల టన్నుల్లో ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేశారు. కొండల్ని తలపించేలా కుప్పలు పోసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో గనులు శాఖ అధికారులు వైసీపీ నేతలకు అండగా నిలిచారు.

ఎవరి జేబుల్లోకి ఆ డబ్బులు?

కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ప్రతిరోజూ వేల లారీల ఇసుకను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి లారీ లక్ష వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక దందాకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నా ఎన్‌పోర్స్‌మెంట్ బ్యూరో [సెబ్] అటు వైపు కన్నెత్తి చూడదు. ఇసుక ర్యాంపుల్లో వే బ్రిడ్జి లు లేవు. కేవలం అంచనాల మేరకు లోడ్ చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణాపై గనుల శాఖ ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలకు వెళ్లరు. ఎంత లోతు ఇసుక తవ్వుతున్నా అడిగే నాథుడే లేదు. ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపులు అంగీకరించడం లేదు. నగదు చెల్లిస్తేనే ఇసుక లోడ్ చేస్తున్నారు. చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆన్ లైన్ చెల్లింపులు జరుగుతుంటే రోజు కోట్లలో వ్యాపారం జరిగే ఇసుకకు ఆన్ లైన్ చెల్లింపులకు అనుమతి లేకపోవడం అంటే డైరెక్టు నగదు చెల్లింపులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి.. ఇసుకను కొల్ల గొడుతున్నా,ప్రభుత్వానికి ఆదాయ రాకపోయినా పట్టించుకోవడం లేదు. దీని మూలంగా నదుల భౌగోళిక స్వరూపాలు మారి ఫలితంగా వరదలు,కరువులు సంభవించే ప్రమాదం వుంది. ఆనకట్టల పునాదుల స్థిరత్వం దెబ్బతిని వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది.

నదుల్లో ప్రమాదకరంగా గోతులు

ఇసుకాసురులు నదీగర్భాల్లో జొరబడి ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. దీంతో భూగర్భజలాలకు పెను ప్రమాదం ఏర్పడింది. ప్రైవేటు సంస్థకు తవ్వకాలు అప్పగించడమే కాదు. వాల్టా చట్టానికి సవరణలు చేయడం ఎవరి ప్రయోజనాల కోసమని పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అనుమతి వున్న రీచ్‌లలో కూడా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా తవ్వకుండా నిబంధనలు వుండేవి. కానీ ఇప్పుడు ఇష్టారాజ్యంగా తవ్వకాలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వాల్టా చట్టం సవరణ చేయడం దారుణం. ఇసుక ధరను మూడు నుండి నాలుగు రెట్లు ధరను పెంచింది. కృష్ణానది పరీవాహక ప్రాంతాల రీచ్ ల నుండి వేలాది లారీలతో ఇసుక తరలి పోతుంది. ఉదాహరణ కి ఒక్క చందర్లపాడు మండలం కాసరబాద రేవు నుండే రోజుకు 1000 లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. ఈ ఇసుక రవాణాలో అధికార పార్టీలో ప్రధాన వ్యక్తుల ప్రమేయం ఉండటంతో అధికారులు సైతం నోరు మెదపడం లేదు.

నిర్మాణరంగం కుదేలు

రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఉపాధిపై ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం భవన నిర్మాణ రంగమే అని చెప్పాలి. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలు కావడంతో రాష్ట్రంలో చోటు చేసుకున్న దుష్పరిణామాలు చూస్తున్నాం. నాలుగేళ్లుగా వైసీపీ ఇసుక కొరత సృష్టించడంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడిన విషయం తెలిసిందే. ఇసుక తవ్వకాలలో అధికార పార్టీ నేతల, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఉపాధి కల్పనతో పాటు, అభివృద్ధికి కీలకమైన ఇసుక వినియోగం, నియంత్రణకు సంబంధించి పటిష్ట విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలతో అనేక పర్యావరణ సమస్యలతో పాటు, సామాజిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని, ఇసుకతో పాటు, నీరు కూడా మాయమవుతోందని, ఇది జలచరాలపై ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుంది. పకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం తవ్వుకు పోతున్న ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నది జగన్ ప్రభుత్వం.

- నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story

Most Viewed