Hindenburg Report: అదానీ రచ్చ దేశానికి మచ్చ

by Disha edit |
Hindenburg Report: అదానీ రచ్చ దేశానికి మచ్చ
X

ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ వ్యాపారం తాలూకా అవకతవకలు దేశానికి మచ్చ తెచ్చేవిలా ఉన్నాయి. అదానీ తన వ్యాపారాలలో షేర్ల విలువలను ఎక్కువ చేసి మార్కెట్ విలువలను పెంచి తప్పుడు డాక్యుమెంట్లతో అప్పులు తీసుకుంటూ బ్యాంకులను ఇతర సంస్థలను మోసం చేస్తున్నాడని, ఆయన వ్యాపారం అంతా మోసమేనని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్, షేర్ల పరిశోధనా సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక బయటకు రావడంతో అదానీ కంపెనీల షేర్లు కూలడం ప్రారంభించి ఈ నెల రెండో తారీకు నాటికి అదాని కంపెనీల షేర్ల డబ్బు దాదాపు ఐదున్నర లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి.

ఈ నివేదికలో ఏముంది?

హిండెన్ బర్గ్ అమెరికా కంపెనీ, ఇది ఒక షార్ట్ సెల్లింగ్ స్టార్టప్ సంస్థ. 9 మంది కనీస ఉద్యోగులతో నడుస్తున్న ఈ సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నది. ప్రపంచంలోని పెద్ద కంపెనీల గమనాన్ని సంస్థ పర్యవేక్షిస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ కంపెనీలపై రిపోర్టులు విడుదల చేస్తుంది. హిండెన్ బర్గ్ సంస్థ ఇంతవరకు 16 వ్యాపార సంస్థల రిపోర్టులు విడుదల చేయగా, అందులో 99 శాతం ఆ సంస్థల వివరాలు వాస్తవాలనేనని తెలిసింది. అయితే ఈ నివేదికను అదానీ తప్పుపడుతూ ఇది భారత్ జాతీయతపై సమగ్రత పై దాడి చేసినట్టుగా వివరించి ఆ రిపోర్టును ఖండించాడు. ఈ నివేదిక ఎత్తిచూపిన వివరాలు సరైనవి కాదని ఏదో పనికిరాని డాక్యుమెంట్లని అడ్డం పెట్టుకొని ఈ రిపోర్టు రూపొందించారని అంటున్నాడు అదాని. అయితే ఈ వార్తలపై స్పందించిన హిండెన్ బర్గ్ సంస్థ జాతీయత పేరుతో ఆయన ఎవరినీ మోసం చేయలేరని ఆయన చేసిన వ్యాపారాలు మొత్తం మోసమేనని మరోసారి తేల్చి చెప్పింది. కాగా అదానీ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఫీల్డ్, అదానీ ఓడరేవులు, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ నేచురల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్ తదితర వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఈ కంపెనీల సంపదతో ఆయన ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నాడు. కానీ ఈ నివేదిక మూలంగా ఆయన 82 లక్షల సంపద కోల్పోయారు. దీంతో ప్రపంచ కుబేర జాబితాలో 13వ స్థానానికి పడిపోయాడు. ఈ వివాదం తర్వాత తన ఎంటర్ప్రైజెస్ తరఫున 20 వేల కోట్లతో ఎఫ్‌పీఓ విడుదల చేశారు. కానీ దానికి అనుకున్న స్పందన కూడగట్ట లేకపోవడంతో దానిని రద్దు చేసుకున్నారు.

వారి లిస్టింగ్ నుంచి కంపెనీలు అవుట్

అదానీపై హిండెన్‌బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికపై ప్రస్తత పార్లమెంటు సమావేశాలలో రచ్చ రచ్చ అవుతుంది. ఈ వ్యవహారంపై స్పందించాలని ఉభయసభల పార్లమెంట్ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అలాగే ఈ రిపోర్టుపై చర్చించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. 20 ఏళ్ళ క్రితం హర్షద్ మెహతా, కేతన్ పారెక్, సత్యం కంప్యూటర్స్ సంస్థల షేర్ల కుంభకోణం జరిగి అప్పుడు షేర్ మార్కెట్ అంతా కుదేలయింది. ఆ చేదు జ్ఞాపకాలను మరచిపోతున్న తరుణంలో హఠాత్తుగా అదానీ విషయం బయటపడటంతో భారత ప్రజానీకాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ నివేదిక షేర్ మార్కెట్‌‌ను పూర్తిగా కుదిపేసింది. ఇప్పుడిప్పుడే షేర్ మార్కెట్‌ కోలుకునే పరిస్థితి లేదు.హర్షద్ మెహతా వలె అదానీ ఉదంతం కూడా భారతదేశానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీకి అదానీతో సన్నిత సంబంధాలు ఉన్నాయని, ఆయనే బీజేపీ పార్టీకి భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారని, ఈ కారణంగా ఆయనకు ఎన్నో రకాలుగా ప్రభుత్వం ఫేవర్ చేస్తున్నదని వార్తలు వెలువెత్తుతున్నాయి.

అదానీ సంస్థలలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదానీ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దాదాపు 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు అదానీ వ్యాపారాలకు 7000 కోట్ల రుణాలను అందించినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తీసుకుంటే తప్ప షేర్ మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం లేదు. ప్రధాని మోదీ కూడా ఇంకా మౌనం వహించకుండా ప్రజలకు సమాధానం చెప్పగలరని ప్రజలు కోరుతున్నారు. అలాగే రిజర్వ్ బ్యాంకు సైతం ఈ విషయంపై బ్యాంకుల నివేదికను డిమాండ్ చేసింది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తే ప్రజలకు కేంద్ర ప్రభుత్వ నిబద్ధత అర్థం అయ్యే అవకాశం ఉంటుంది. కాగా అదానీ సంస్థల లిస్టింగ్‌ను న్యూయార్క్‌లోని స్టాక్ ఎక్స్చేంజీ, జపాన్‌లోని స్టాక్ ఎక్స్చేంజీలు తొలగించినట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా అదానీ విషయంలో తొందరగా నిజానిజాలు బయటికి వస్తే బాగుంటుంది.

శ్రీ నర్సన్

8328096188

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨

ఇవి కూడా చదవండి : కనీవినీ ఎరుగని భూకంపం



Next Story

Most Viewed