దుబ్బాక ఉపఎన్నికపై ఈసీ జోక్యం చేసుకోవాలి

by  |
దుబ్బాక ఉపఎన్నికపై ఈసీ జోక్యం చేసుకోవాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిపించే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదేనని నొక్కిచెప్పిన తెలంగాణ జన సమితి దుబ్బాక ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం కమిషన్‌కు లోబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉందని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అవుతోందన్నారు. కేవలం ప్రతిపక్షాలపై దాడులు చేయడానికి, నియంత్రించడానికి మాత్రమే ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధినేత కోదండరాం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేటలో సోమవారం జరిగిన సంఘటన మొదటిదేమీ కాదని, గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా జరిగిందని గుర్తుచేశారు.

గతంలో టీఎన్ శేషన్ లాంటి పెద్దల నేతృత్వంలో సమర్ధవంతమైన నిర్వహణ కారణంగా కమిషన్‌కు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. సిద్దిపేట లాంటి ఘటనలు జరిగినప్పుడు గట్టిగా వ్యవహరించకపోతే ఎన్నికల కమిషన్ తన నిజాయితీ, చిత్తశుద్ధి, నిష్పక్షికత స్వభావాన్ని, గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దురదృష్టవశాత్తూ తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగం ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దీనికి బదులుగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పార్టీకి చెందినవారు తప్పుచేసినా చర్యలు తీసుకోవాలని, అందులో ఆక్షేపించాల్సిన అవసరమే లేదని, కానీ వివక్ష పూరితంగా వ్యవహరించవద్దనే తమ పార్టీ కోరుతోందన్నారు. ప్రస్తుత తరుణంలో ఎన్నికల నిర్వహణపై ఈసీకి చాలా బరువైన బాధ్యతలే ఉన్నాయన్నారు. అధికారులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలని, విధేయులుగా ఉండాలని, అంతే తప్ప పాలకుల పట్ల విధేయత చూపడం సరైంది కాదన్నారు.

Next Story

Most Viewed