గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

by  |
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‎ను మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. షెడ్యూల్‎తో పాటు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్ధసారథి మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన బల్దియా పోలింగ్ ఉండగా.. 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచి జీహెచ్ఎంసీ నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 20వ తేదీన నామినేషన్లకు చివరి రోజు కాగా, 21న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 24వ తేదీ అని వెల్లడించారు. ఒకవేళ రీ పోలింగ్ అవసరమైతే డిసెంబర్ 3న నిర్వహించనున్నట్లు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందని ఎన్నికల కమిషనర్ పార్థసారధి స్పష్టం చేశారు. చట్టప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. రిజర్వేషన్ల ప్రకారం జీహెచ్ఎంసీ మేయర్‎గా మహిళ (జనరల్) కు కేటాయించినట్లు తెలిపారు. బీసీ 50, ఎస్సీ 10, ఎస్టీ 02, జనరల్ 44, జనరల్ మహిళ 44 కేటాయించినట్లు పార్థసారథి వివరించారు.

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 74,04,486 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 52.09 శాతం ఉండగా.. మహిళలు 47.90 శాతం ఉన్నారు. ఇక అతి పెద్ద డివిజన్ గా ఉన్న మైలార్‎దేవ్‎పల్లిలో 79,290 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా రామచంద్రపురం లో 27,997 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మహిళలు ఎక్కువగా ఉన్న బన్సీలాల్‎పేటలో మహిళలు 31,205 మంది ఉండగా.. పురుషులు 30,727 మంది ఉన్నారు. ఇక ఫతేనగర్ డివిజ‎న్‎లో ట్రాన్స్ జెండర్‎లు అధికంగా ఉన్నారు.

ఎన్నికల సంఘం గ్రేటర్‌ వ్యాప్తంగా రెండు, మూడు రోజుల క్రితం పోలింగ్‌ ముసాయిదాను ప్రకటించింది. ఎన్నికల కోసం 9,248 స్టేషన్లను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పోలింగ్‌స్టేషన్లలో తక్కువ మంది సిబ్బందితోనే ఎన్నికలు సక్రమంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుండడంతో వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని తీసుకొని పకడ్బందీగా ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది.

Next Story

Most Viewed