ముహూర్తం ఫిక్స్.. 200 మందితో బీజేపీలోకి ఈటల

by  |
eatala-rajender
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారం ఆసక్తి రేపుతోంది. ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈటల తన ఎమ్మెల్యే రాజీనామాకు సమయం వచ్చేసింది. శనివారం(ఈ నెల 12న) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి, ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సమర్పించనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఈ నెల 14వతేదీన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఉదయం తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్‌ను కోరారు. ఒకవేళ పోచారం అందుబాటులో లేకున్నా.. తన రాజీనామా పత్రాన్ని కార్యాలయంలో ఇవ్వనున్నట్లు ఆయన సన్నిహితుడొకరు ‘దిశ’కు తెలియజేశారు. ఈటల ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు పోచారం అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. పోచారం అందుబాటులో లేనని, అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈటల మాత్రం స్పీకర్‌ను కలిసిన తర్వాతనే రాజీనామా చేస్తానని భావించినట్లు తెలిపారు. అయితే ఈ నెల 14న బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారు కావడం.. సోమవారం పెద్ద ఎత్తున తన అనుచరులతో ఢిల్లీకి వెళ్లనుండడంతో శనివారం ఉదయం స్పీకర్ అసెంబ్లీలో అందుబాటులో ఉంటే స్పీకర్‌కు రాజీనామా పత్రం అందజేస్తారని, లేదంటే కార్యాలయంలో పత్రాన్ని అందజేస్తారని తెలిసింది.

200 మందితో ఢిల్లీకి పయనం..

కమలదళంలోకి వెళ్లేందుకు ఈటల భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 200 మందితో ఢిల్లీకి పయనమవుతున్నారు. తన అనుచరగణంతో భారీ సంఖ్యలో తరలివెళ్లి కాషాయ కండువా కప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీరిలో కీలక నేతలు ఈటలతో వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ముందుగా వారి పేర్లను లీక్ చేస్తే.. అధికార టీఆర్ఎస్ పార్టీ వారిని చేరొద్దని ఒత్తిడి చేసే అవకాశం ఉందని, వారి పేర్లను బయట పెట్టడడంలేదని ఓ నాయకుడు పేర్కొంటున్నాడు. ఈటల వెంట కీలక నాయకులు ఢిల్లీకి వెళ్లుతున్నట్లు చెబుతున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పార్టీలో చేరుతున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఈటల ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మాజీ కేంద్ర మంత్రి రమేశ్ రాథోడ్‌తో పాటు టీఎంయూ మాజీ నేత అశ్వత్థామరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఇద్దరు కూడా ఈటల రాజేందర్ నివాసంలో ఆయనతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సైతం కూడా బీజేపీలో తీసుకురావాలని బీజేపీ నేతల ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి మాజీమంత్రి డీకే అరుణ కొద్దరోజుల క్రితం విశ్వేశ్వర్ రెడ్డితో చర్చలు జరిపారు.


Next Story