వారం రోజుల్లో రాష్ట్రమంతటా 'ఈ-ఆఫీస్'

by  |
వారం రోజుల్లో రాష్ట్రమంతటా ఈ-ఆఫీస్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కష్టకాలంలో యాభై శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరవుతూ ‘వర్క్ ఫ్రం హోమ్’ పద్ధతిలో పనిచేస్తున్నందున ఇకపైన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే ఏడు శాఖల్లో ఇది అమలవుతుండగా తాజాగా సోమవారం మరో ఎనిమిది శాఖల్లో, రెండు హెచ్ఓడీలలో అమల్లోకి వచ్చింది. మిగిలిన అన్ని శాఖల్లో, హెచ్ఓడీలలో రానున్న వారంరోజుల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

ఈ నూతన విధానం ద్వారా అన్నిశాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని, ఫైళ్ళ కదలికలు వేగవంతమవుతాయని, పారదర్శకత చోటుచేసుకుంటుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయా శాఖల్లో పనులు సమర్ధవంతంగా, జవాబుదారీతనంతో జరుగుతాయని పేర్కొన్నారు. నూతన విధానం ద్వారా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేస్తారని, ఫైళ్ళను ఒక చోటి నుంచి మరోచోటికి పంపడంలో వేగం పెరుగుతుందని, తొందరగా ప్రాసెస్ అవుతాయని, క్లియరెన్స్ కూడా వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సచివాయలంలోని వైద్యారోగ్యం, ప్లానింగ్, కార్మిక-ఉపాధి, బీసీ సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోం తదితర శాఖలలో అమలవుతూ ఉన్నదని, కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం, వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ ఈ విధానం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.



Next Story