దుబ్బాక ప్రభావం జీహెచ్ఎంసీలో ఎంత?

by  |
దుబ్బాక ప్రభావం జీహెచ్ఎంసీలో ఎంత?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దుబ్బాక పేరు వింటేనే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలుపుతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ కనిపిస్తోంది. త్వరలో జరుగనున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వంద సీట్లు మావే అంటూ ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన నగరంలో చర్చనీయాంశమైంది. దీంతో ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని నాయకులు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంతో పోలిస్తే బీజేపీకి ఓటింగ్ శాతంతో పెరుగుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.

త్వరలో జరుగనున్న మహా నగరపాలక సంస్థ ఎన్నికలపై దుబ్బాక ఉప ఎన్నికల ప్రభావం కనిపించబోతోంది. దుబ్బాకలో అధికార పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టి బీజేపీ ఘన విజయం సాధించడంతో గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ అసమ్మతి శ్రేణులు బీజేపీలో చేరతాయనే ప్రచారం నగరంలో ఊపందుకుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న పాలక వర్గంలో 99మంది కార్పొరేటర్లు అధికార పార్టీకి చెందిన వారే. రాబోయే ఎన్నికల్లో వీరు తిరిగి టిక్కెట్టు ఆశిస్తుండగా పార్టీకి దీర్ఘ కాలంగా పని చేస్తున్న ఇతర నాయకులు కూడా కార్పొరేటర్ టిక్కెట్ పై ఆశలు పెంచుకోవడమే కాకుండా ఎలాగైన తమకు అవకాశం ఇవ్వాలని తెలిసిన అగ్రనాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వారి అభ్యర్థనలు అధిష్టానం దృష్టికి వెళ్లకపోవడంతో వారు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఈ తరుణంలో దుబ్బాక ఫలితం బీజేపీకి అనుకూలంగా రావడంతో టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు బీజేపీలో చేరేందుకు మార్గం సుగుమం చేసుకుంటున్నట్లు గ్రేటర్ వ్యాప్తంగా చర్చ ఊపందుకుంది.

అధ్యక్షుడి ప్రకటనతో కొత్త జోష్:

గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు మావే అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల చేసిన ప్రకటన నగరంలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలుకుబడి ఉన్న నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని, పార్టీ తీర్థం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం నగరంలో జరుగుతోంది. ఆయా పార్టీల అసమ్మతి నాయకులు త్వరలో బీజేపీలో చేరతారనే చర్చలు మొదలయ్యాయి. వీటన్నింటిని విశ్లేషించిన తర్వాతనే పార్టీ అధ్యక్షుడు సంజయ్ వంద సీట్లలో విజయం సాధిస్తామని ప్రకటన చేశారని బీజేపీకి నాయకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే గతంతో పోలిస్తే బీజేపీకి రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు.

పెరిగిన ఓటింగ్ శాతం..

2009 సంవత్సరంలో మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ 9.97శాతం ఓట్లతో 5డివిజన్లలో విజయం సాధించింది. 2016 ఎన్నికల్లో పార్టీకి స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ ఒక డివిజన్ తగ్గి 4డివిజన్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. గత ఎన్నికల్లో బీజేపీ 10.34శాతంతో 3,46,253 ఓట్లు సాధించింది. ఐతే త్వరలో జరుగుబోయే ఎన్నికల్లో మాత్రం 2009, 2016 కంటే భిన్నంగా ఉంటాయని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. దీనికంతటికీ దుబ్బాక ఫలితాలే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతే కారణమని చర్చించుకుంటున్నారు.

కమలం వైపే..

ఒక్క దుబ్బాక అసెంబ్లీ ఫలితంతో గ్రేటర్ హైదరాబాద్ లో సీన్ ఒక్కసారిగా మారిపోయినట్లుగా కనబడుతోంది. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమేనంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు అసంతృప్తులు బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని, త్వరలో పార్టీలో చేరతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడమే కాకుండా మెజార్టీ డివిజన్లలో విజయం సాధించేందుకు ఉపకరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Next Story

Most Viewed