తాగేందుకు డబ్బులివ్వలేదని.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి దారుణ హత్య

by  |
తాగేందుకు డబ్బులివ్వలేదని.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి దారుణ హత్య
X

దిశ, చార్మినార్​: అర్థరాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ బాటసారిని దాడిచేసి హత్య చేసిన అనంతరం తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ సీఐ పి.శ్రీనివాస్​కథనం ప్రకారం.. లాల్​దర్వజా పత్తర్​కీ దర్గాకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్​ (33)మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని రోడ్ల పై బాటసారులను వేడుకునేవాడు. డబ్బులు నిరాకరించిన వారిని బెదిరించడంతో పాటు దాడికి పాల్పడుతూ డబ్బులు వసూలు చేసేవాడు.

ఈ నేపధ్యంలోనే అక్టోబర్​1వ తేదీన అర్థరాత్రి 12గంటల సమయంలో తాగేందుకు డబ్బులు లేకపోవడంతో అటుగా వస్తున్న మొఘల్​పురాకు చెందిన ఆటో డ్రైవర్​ సయ్యద్​ జహంగీర్​(45)ను అడ్డుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అతను ససేమిరా అనడంతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పిడిగుద్దులు గుద్దుతూ చితక బాదుతుండగా అతనిని తప్పించుకున్న జహంగీర్ పక్కనే ఉన్న హాజి కూల్​డ్రింక్​ షాపులోకి వెళ్లి తలదాచుకున్నాడు. జహంగీర్‌ను వెంబడించి మరీ పట్టుకుని మరోసారి తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన జహంగీర్​అక్కడిక్కడే మృతిచెందాడు. మొదట అనుమానస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో జహంగీర్‌ది అనుమానస్పద మృతి కాదు.. హత్యగా పోలీసులు నిర్దారించారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఇర్ఫాన్‌ను శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.



Next Story

Most Viewed