ఫ్లాష్ ఫ్లాష్ : నాడు డ్రైవర్లు.. నేడు ఓనర్లు అయ్యారు..

by  |
maruthi-tempo
X

దిశ, కరీంనగర్ సిటీ : కుటుంబ పోషణ కోసం ఒకరి వద్ద పని చేసిన వారు, ఇప్పుడు మరొకరికి ఉపాధి కల్పించబోతున్నారు. నిన్నటి దాకా వాహనాలపై డ్రైవర్లుగా పని చేసిన వారంతా నేడు ఓనర్లుగా మారారు. పొద్దంతా వాహనాలపై పని చేసి, సాయంత్రం కూలి డబ్బులకు చేతులు కట్టుకున్న వారు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరొకరికి కూలి ఇచ్చే స్థాయికి ఎదిగారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయటం పట్ల వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ గురువారం కలెక్టరేట్‌లో యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దళిత బంధును హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈనెల 16న ప్రారంభించి ఇదే నెలలో లబ్ధిదారులకు వాహనాలందించడం అభినందనీయమన్నారు. దళితబంధు పథకానికి ఇప్పటివరకు రూ. 2000 కోట్లు విడుదల కాగా.. హుజరాబాద్ నియోజకవర్గంలోని 21 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.

మొదటి విడుతగా దళిత బంధు ప్రారంభోత్సవంలో 15 చెక్కులను సీఎం అందించారని, నాలుగు యూనిట్ల కింద నేడు లబ్ధిదారులకు 2 ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారు అందజేసినట్లు తెలిపారు. దశల వారీగా దళితులందరికీ పథకం అమలు అవుతుందని, ప్రతీ దళిత కుటుంబం అభివృద్దే ధ్యేయంగా అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు దళిత బంధు పథకం కింద దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్, ఎలుక పల్లి కొమరమ్మ – కనకయ్య దంపతులకు ట్రాక్టర్, జి సుగుణ – మొగలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్‌కు మారుతి (టెంపో) కారు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, రవాణా శాఖ ఉప కమిషనర్ ఎం. చంద్ర శేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story