డాక్టర్ సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చు: హైకోర్టు

by  |
డాక్టర్ సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చు: హైకోర్టు
X

దిశ, ఏపీ బ్యూరో: నర్సీపట్నం ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా పని చేస్తూ.. ఇటీవల అరెస్టు అయ్యి మానసిక చికిత్స ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కి హైకోర్టు అనుమతి ఇచ్చింది. గత నెల 15న రోడ్డుపై న్యూసెన్స్ చేస్తున్నారన్న ఆరోపణలతో కేజీహెచ్‌కి అక్కడి నుంచి విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందుకుంటున్న వైద్యుడు సుధాకర్‌ను డిశ్చార్జ్ చేయాలని కోరుతూ ఆయన తల్లి వేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నేడు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మానసిక ఆస్పత్రి సూరింటెండెంట్‌‌ను సంప్రదించి ఎప్పుడైనా డిశ్చార్జ్‌ కావచ్చని తెలిపింది.

అయితే సీబీఐ విచారణకు సహకరించాలన్న షరతు విధించింది. అలాగే మరో పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం డాక్టర్ సుధాకర్‌ను బంధువులకు అప్పగించాలని సూచించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు ఈ రోజు ఉదయం విచారణ నిమిత్తం నర్సీపట్నం వెళ్లారు. సుధాకర్ పనిచేసిన ఆసుపత్రిలో ఆయన సర్వీసు రికార్డులను, హాజరులను పరశీలించారు. ఆయన వ్యవహార శైలిపై పలువురిని ప్రశ్నించారు. అనంతరం నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని సీబీఐ అధికారులు విచారించారు. కాగా, కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాప్తి నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఓ సమావేశంలో పాల్గొన్న సుధాకర్ తమకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే వివాదం ప్రారంభమై సీబీఐ కేసు వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విషయాలను సీబీఐ అధికారులు తెలుసుకున్నారు.


Next Story