డా.రెడ్డీస్‌పై సైబర్ దాడి

by  |
డా.రెడ్డీస్‌పై సైబర్ దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ సర్వర్లపై సైబర్ దాడి జరిగింది. కంపెనీకి చెందిన ఐటీ సర్వర్లపై సైబర్ దాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చెందిన డేటా సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. సంస్థకు చెందిన ఐటీ సర్వర్లపై సైబర్ దాడి జరిగినట్టు గుర్తించామని, తగిన నివారణ చర్యలను తీసుకునే క్రమలో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లను మూసివేశామని వివరించింది.

సెంటర్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పినప్పటికీ, సైబర్ దాడి ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారనే అంశాలను డాక్టర్ రెడ్డీస్ వివరాలను ఇవ్వలేదు. అయితే, కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ సీఈవో ముఖేశ్ స్పష్టం చేశారు. మరో 24 గంటల్లో పరిస్థితి అదుపులో ఉంటుందని నమ్ముతున్నట్టు తెలిపారు.

కాగా, భారత్‌తో పాటు అమెరికా, బ్రెజిల్, యూకే, రష్యాలోని ప్లాంట్లు ప్రభావితమయ్యాయని కంపెనీ పేర్కొంది. ఇటీవల భారత్‌లో రష్యాకు చెందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి మానవ పరీక్షలకు డాక్టర్ రెడ్డీస్ డీజీసీఐ నుంచి అనుమతి తీసుకుంది. ఈ అనుమతి వచ్చిన రోజుల వ్యవధిలోనే సైబర్ దాడి జరగడం గమనార్హం. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. ఫార్మా రంగం షేర్లు డీలా పడగా, డాక్టర్ రెడ్డీఎస్ షేర్ ధర 4 శాతం వరకు నీరసించింది.



Next Story

Most Viewed