నర్సంపేట్: పాలిటెక్నిక్ విద్యార్థి మృతిపై సందేహాలు

by  |
polytechnic student sanjay
X

దిశ, వ‌రంగ‌ల్ ప్రతినిధి/న‌ర్సంపేట/న‌ర్సంపేట టౌన్: వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట ప‌ట్టణ శివారు ల‌క్నెప‌ల్లి బిట్స్ కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద‌స్థితిలో మృతి చెందాడు. కాలేజీ యాజ‌మాన్యం, పోలీసులు, మృతుడి త‌ల్లిదండ్రుల‌కు తెలిపిన వివరాల ప్రకారం.. హ‌న్మకొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లం వంగ‌ప‌ల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌, క‌విత‌ల కుమారుడు సంజయ్(19) న‌ర్సంపేట బిట్స్ క‌ళాశాల‌లో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మ‌రో న‌లుగురు తోటి విద్యార్థులతో క‌ల‌సి కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. రెండ్రోజుల క్రితం ఓ విద్యార్థి కార‌ణంగా హాస్టల్ గ‌ది కిటికీ ప‌గిలిపోయింది. ఈ విష‌యం యాజ‌మాన్య సిబ్బందికి తెలియ‌డంతో రూములో ఉన్నవారంతా క‌లిసి కిటికీ డ్యామేజ్‌కు సంబంధించిన ఖ‌ర్చును భ‌రించాల్సి ఉంటుంద‌ని తెలియ‌జేసింది.

చేయ‌ని త‌ప్పుకు తామెందుకు డ‌బ్బులు క‌డ‌తామ‌ని అద్దం ప‌గుల‌కొట్టిన విద్యార్థితో మిగ‌తా విద్యార్థులు వాగ్వాదం చేశారు. శుక్రవారం రాత్రి 7గంట‌ల స‌మ‌యంలో ప్లేట్లలో భోజ‌నం పెట్టుకుని ఐదుగురు గ‌దిలోకి వ‌చ్చారు. తినే స‌మ‌యంలోనే మ‌రోసారి కిటికీ అద్దం ప‌గిలిన విష‌యం విద్యార్థుల మ‌ధ్య చ‌ర్చకు వ‌చ్చింది. దీంతో అద్దం ప‌గుల‌గొట్టిన విద్యార్థి మ‌రో విద్యార్థిపై దాడికి దిగాడు. వీరిద్దరిని ఆపేందుకు వెళ్లిన సంజ‌య్ పెనుగులాట‌లో కిటికీలోంచి బ‌య‌ట‌ప‌డిపోయాడు. ఆల‌స్యంగా విష‌యం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ సంజ‌య్‌ను న‌ర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి వ‌రంగ‌ల్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి త‌ర‌లించారు. రాత్రి 11గంట‌ల స‌మ‌యంలో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు.

సంఘ‌టన‌పై అనుమానాలు..

అయితే.. యాజ‌మాన్యం మృతుడి బంధువుల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు తెలిపిన సంఘ‌ట‌న‌ వివ‌రాల‌కు, క‌ళ్లకు క‌నిపించే వాస్తవ ప‌రిస్థితుల‌కు పొంత‌న‌లేకుండా ఉండ‌టం గ‌మ‌నార్హం. దాదాపు ఐదున్నర అడుగులున్న సంజ‌య్, మూడున్నర అడుగుల హైట్ ఉన్న కిటీకి గోడదాటుకుని, మ‌ధ్యలోంచి బ‌య‌ట‌కు ప‌డిపోయాడ‌ని చెప్పడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు అంత‌స్తుల బిల్డింగ్‌పై నుంచి ప‌డినా సంజ‌య్ త‌ల‌కు ఏం కాలేదు. ఒంటిపై ఎవ‌రో గుద్దిన‌ట్లుగా చ‌ర్మం రెండు మూడు చోట్ల క‌మిలిపోవ‌డం, గీరుకుపోయిన గాయాలు క‌నిపిస్తున్నాయి. మూడు రోజుల క్రిత‌మే విద్యార్థుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని, త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేశామ‌ని పలు రకాల సమాధానాలు హాస్టల్ సిబ్బంది తెలుపడం అనుమానాల‌కు తావిస్తోంది.

విద్యార్థి మ‌ర‌ణం వెనుక బిట్స్ నిర్లక్ష్యం.. గ‌తంలోనూ

విద్యార్థి సంజ‌య్ మ‌ర‌ణం వెనుక యాజ‌మాన్యం నిర్లక్ష్యం క‌ళ్లకు కట్టినట్లు తెలుస్తోంది. హాస్టల్‌లో నిత్యం అందుబాటులో ఉంటూ విద్యార్థుల బాగోగుల‌ను చూడాల్సిన వార్డెన్ ఏం చేస్తున్నారు.? వివాదం మూడు రోజుల క్రిత‌మే జ‌రిగింద‌ని, విద్యార్థుల మ‌ధ్య గొడ‌వ కొన‌సాగుతోంద‌ని తెలిసాక కూడా ఎందుకు పరిష్కారానికి కృషి చేయలేదు. విద్యార్థులను వేర్వేరు రూంలోకి మార్చాల్సి ఉన్నా.. ఎందుకు మార్చలేదు. గతంలో ఇదే కళాశాలలో రాహుల్ అమిన్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థుల‌కు తెలియ‌జేయ‌కుండా కుక్కల‌ను ప్రాంగ‌ణంలోకి వ‌ద‌ల‌డంతో ప‌లువురు గాయ‌ప‌డగా, ఓ విద్యార్థిని ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సంఘ‌ట‌న‌లూ ఉన్నాయి. ఇలా వ‌రుస‌గా బిట్స్‌లో ఘోరాలు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.



Next Story

Most Viewed