వైద్యమే కాదు సాయం కూడా..

by  |
వైద్యమే కాదు సాయం కూడా..
X

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో పనిచేసే ప్రముఖ సర్జన్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, అశ్విని దంపతులు కష్టా్ల్లో ఉన్నవారికి సాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల నిర్మల్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి వారికి కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకెళితే.. బోత్ మండలం కౌట గ్రామానికి చెందిన భీమేష్ నిర్మల్లోని ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తూ ఇటీవల మరణించాడు. తండ్రి మరణించడంతో ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారింది. దీంతో భీమేష్ కుటుంబానికి డాక్టర్ దేవేందర్ రెడ్డి శనివారం రూ. 20,000 చెక్కును అందజేసి అండగా నిలిచారు. అలాగే భీమేశ్ భార్య కావేరికి ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే కడెం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మమత తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ నిర్మల్లోని ఆదిత్య ఆసుపత్రి‌లో చేరింది.ఆమెను పరీక్షించిన డాక్టర్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. వెంటనే దేవేందర్ రెడ్డి ఆమెకు శస్త్రచికిత్స చేయడంతో మమత కోలుకుంది. కోలుకున్న భార్యను ఆస్పత్రి నుంచి తీసుకు వెళ్లేందుకు వచ్చిన భర్త రాజన్న ఆసుపత్రి ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.దీంతో చలించిపోయిన డాక్టర్ దేవేందర్ రెడ్డి మమతకు శస్త్రచికిత్స పూర్తి ఉచితంగా చేశారు. భర్త మృతితో ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి శనివారం రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో జరిగిన చెక్కుల అందజేత కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ దేవేందర్ రెడ్డి గతంలో కూడా తన సేవా భావాన్ని చాటుకున్నారని, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం అభినందనీయమన్నారు.

Next Story

Most Viewed