‘డబుల్ ఇళ్ల’ మెయింటెనెన్స్ మా వల్ల కావట్లే..

by  |
‘డబుల్ ఇళ్ల’ మెయింటెనెన్స్ మా వల్ల కావట్లే..
X

దిశ, కూకట్​పల్లి : డబుల్​ బెడ్​రూం ఇండ్ల సముదాయం నిర్వహణ, ప్రతినెలా ఖర్చులు లబ్దిదారుల పాలిట పెనుభారంగా మారుతున్నాయి. నెలకు వేలల్లో వస్తున్న బిల్లుల మోతతో లబ్దిదారులు సతమతమవుతున్నారు. కూలి పని చేసుకుని బతుకుతున్న తమకు నిర్వహణ ఖర్చు గుది బండగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డబుల్ ఇళ్లు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు డబుల్​ ఇండ్ల సముదాయానికి సంబంధించిన లిఫ్ట్​, కారిడార్​, కామన్​ ఏరియాల విద్యుత్​ బిల్లులు, నల్లా బిల్లులు లక్షల్లో పేరుకుపోయి ఉండటంతో వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని చిత్తారమ్మ బస్తీ డబుల్​ బెడ్​రూం సంక్షేమ సంఘం నాయకులు వాపోతున్నారు.

అందరికీ సరిపడే విధంగా తక్కువ స్థలంలో ఎక్కువ ఇళ్లను కేటాయించడానికి అపార్ట్​మెంట్​లకు తీసిపోని విధంగా 9 అంతస్థుల భారీ బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. దానికి తోడు భవనానికి ఏర్పాటు చేసిన రెండు లిఫ్ట్​లు దాని మెయింటెనెన్స్​, కారిడార్​, కామన్​ ఏరియాలలో విద్యుత్​ దీపాలు, నల్లా బిల్లులు, వాచ్​మెన్​ తదితర ఖర్చులను భరించేందుకు భవన సముదాయం గ్రౌండ్​ ఫ్లోర్​లో 18 దుకాణాలను నిర్మించారు. దుకాణాలను అద్దెకు ఇచ్చుకుని వాటితో వచ్చిన ఆదాయాన్ని డబుల్​ బెడ్​రూం ఇండ్ల సంక్షేమ సంఘం వారు సముదాయానికి అయ్యే ఖర్చులకు వినియోగించుకునే విధంగా ప్రతిపాదనలు పెట్టారు.

రెండేళ్లు గడుస్తున్నా దుకాణ సముదాయాల ఊసేలేదు :

డబుల్​ బెడ్​రూం ఇండ్లను 2019 నవంబర్​ 14న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించి నేటికీ రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు దుకాణ సముదాయాలను కిరాయికి ఇచ్చే ఊసే లేదు. 18 దుకాణాలలో మెయిన్​ రోడ్డుకు 3, భవనం ప్రవేశ మార్గం వైపు 12, వెనుక భాగంలో 3 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సముదాయానికి అయ్యే ఖర్చులకు వినియోగించాల్సి ఉండగా ఇంతవరకు ప్రభుత్వం, హౌజింగ్​ అధికారులు నోటిఫికేషన్​ వేయలేదు. ఎవరికీ అలాట్​ చేయకపోవడంతో రెండేళ్లుగా దుకాణ సముదాయం ఖాళీగా ఉంది. దీంతో భవన సముదాయం నిర్వహణ భారంగా మారింది.

మూడు లక్షలకు పైగా బాకీ :

డబుల్​ బెడ్​రూం ఇండ్లు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు విద్యుత్​ శాఖకు 2.9 లక్షల రూపాయలు, జలమండలికి నల్లా బిల్లుకు సంబంధించి 1,78,387 రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీనికి సంబంధించి డబుల్​ బెడ్​రూం ఇండ్ల సంక్షేమ సంఘం నాయకులు పలు మార్లు పాలకులు, అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. భవన సముదాయం నిర్వహణ తమకు పెనుభారంగా మారిందని, విద్యుత్​ శాఖ అధికారులు విద్యుత్​ సరఫరా నిలిపి వేస్తామని పలుమార్లు వచ్చి పోయారని సంక్షేమ సంఘం నాయకుడు శాఖయ్య తెలిపారు.

నెలకు కనీస ఖర్చు రూ. 76 వేలు..

డబుల్​ బెడ్​రూం ఇండ్ల సముదాయానికి సంబంధించి నెలకు సుమారు 76 వేల రూపాయలు ఖర్చు ఉంటుందని, విద్యుత్​ బిల్లు నెలకు రూ.26 వేలు, నల్లా బిల్లు రూ. 22 వేలు, వాచ్​మెన్​ జీతం రూ.20 వేలు, సముదాయం ఊడ్చడానికి పని మనిషికి 8 వేల రూపాయలు ఖర్చు ఉన్నట్టు సంక్షేమ సంఘం వారు తెలిపారు. ప్రస్తుతం వాచ్​మెన్​, పనిమనిషి జీతాలను సముదాయంలో నివాసముంటున్న వారు అందరూ కలిసి భరిస్తున్నామని, లిఫ్ట్​ చెడిపోయినా తామే సొంత డబ్బులతో మరమ్మత్తులు చేయించుకున్నట్టు వారు తెలిపారు. దుకాణ సముదాయం ద్వారా వచ్చే ఆదాయం రాకపోతే సముదాయం నిర్వహణ తమకు తలకుమించిన భారంగా మారుతుందని వారు చెబుతున్నారు.

ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది :

చిత్తారమ్మ బస్తీ డబుల్​ బెడ్​రూం ఇండ్ల సముదాయం వద్ద నిర్మించిన దుకాణాలను అద్దెకు ఇచ్చి వాటితో వచ్చిన ఆదాయాన్ని విద్యుత్​, నల్లా బిల్లులు, ఇతర ఖర్చులకు వినియోగించడానికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. ఇందుకు గాను నలుగురు మంత్రులతో కూడిన కమిటీని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నారు. త్వరలో దుకాణాలను అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

రవీందర్​ ఈఈ, హౌజింగ్​ విభాగం, జీహెచ్​ఎంసీ



Next Story