రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తారా..?

by  |
Anil Kurmachalam
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతుంటే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేయడం మానుకోవాలని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హితవు పలికారు. గురువారం హుజూరాబాద్‌లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు దూసరి అశోక్ గౌడ్, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఉపఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీమెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు అవకాశమిస్తే రైతుబంధు, దళితబంధులాంటి కార్యక్రమాలు బంద్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఈటల రాజేందర్‌‌ను కేసీఆర్ సొంత తమ్ముడిలా భావించి రాజకీయంగా ప్రోత్సహించి ఎన్నో అవకాశాలు కలిపించారని, కానీ ఆయన మాత్రం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

గుర్తింపునిచ్చిన పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, స్వప్రయోజనాల కోసం బీజేపీలో చేరారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమిస్తున్నారని, రాబోయే ఉప ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తారన్నారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ప్రత్యేక కార్యాచరణతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తుందని తెలిపారు.

సమావేశంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రాజ్ కుమార్ శానబోయిన, విక్రమ్ కుమార్, తిరుమందాస్ నరేష్, రఘువరన్, హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, హుజురాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్ రెడ్డి, హుజురాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ గాలి రాకేష్, టీఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా, లవన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story