పోలీసుల పై సుప్రీం సీరియస్.. ఎవరికి కొమ్ముకాస్తున్నారు అంటూ చురకలు

by  |
suprim
X

న్యూఢిల్లీ: దేశంలో పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు వారి అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారు’ అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారులు చట్టానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సస్పెండైన సీనియర్ ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్‌‌పై దేశద్రోహం, అసమాన ఆస్తులను కూడబెట్టడం వంటి కేసులు నమోదు చేసింది.

వీటిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సదరు అధికారికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం ఇబ్బందికర ధోరణిలా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ఇది దేశంలో చాలా ఇబ్బందికర ధోరణి. ఇందుకు పోలీస్ శాఖ సైతం బాధ్యులే. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే, పోలీసులు ఆ ఒక్క పార్టీకే వత్తాసు పలుకుతారు. దీని వల్ల ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి రాగానే సదరు పోలీసు అధికారులపై ప్రతీకార చర్యకు సిద్ధమవుతుంది. ఈ విధానం మారాలి’ అని సూచించారు. అలాగే, ఐపీఎస్‌ అధికారి గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయొద్దని, ఈ కేసులపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదే సమయంలో పోలీసుల విచారణకు గుర్జిందర్ సహకరించాలని సూచించారు.


Next Story

Most Viewed