రిటైర్‌మెంట్ పేరిట వసూళ్లు.. టార్గెట్ 50 వేలు

by  |

దిశ, నిజామాబాద్: పంచాయతీ రాజ్ శాఖలో అతనో ఉన్నతస్థాయి అధికారి. మే 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తన ద్వారా లబ్ధి పొందిన అధికారులు, కాంట్రాక్టర్‌లు రిటైర్‌మెంట్ ఫండ్ ఇవ్వాలని టార్గెట్ విధించారు. దీంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సబంధిత శాఖా అధికారులు, కాంట్రాక్టర్‌లు ఇప్పుడు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారి విడ్కోలు కార్యక్రమం నాటికి డివిజన్ స్థాయిలో అధికారులకు రూ.50 వేలు, కాంట్రాక్టర్ కు రూ.3లక్షల వరకూ డిసైడ్ చేసినట్టు సమాచారం. అసలే కరోనా కారణంగా పనులు నిలచిపోయి చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో లక్షల రూపాయలు ఎక్కడ నుంచి తేవాలని కాంట్రాక్టర్‌లు వాపోతున్నారు. జిల్లాలో 10 నుంచి 15 మంది కాంట్రాక్టర్‌లకు టార్గెట్ విధించడంతో అధికారులు పైసల వసూళ్లకు సమాయాత్తం అవుతున్నారు. ఇదిలా ఉండగా ఒక డివిజనల్ స్థాయి అధికారి రిటైర్మెంట్ కానున్న అధికారి తరపున కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేయడం విశేషం. వసూళ్లకు ఒక డివిజనల్ స్థాయి అధికారి ముందుండి నడపటంతో అధికారులు, కాంట్రాక్టర్‌లు కిక్కురు మనకుండా తమ వంతు టార్గెట్‌గా ఇచ్చిన వాటిని ఎలాగో అలా సర్ధే పనిలో పడ్డారు.



Next Story