ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
X

దిశ, కరీంనగర్ సిటీ : స్థానిక సంస్థల కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పి.జి కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి, ఎన్నికల సామాగ్రితో పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. సామాగ్రి పంపిణీ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్బంగా పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ అధికారులు పొందిన శిక్షణ ప్రకారం ఎన్నికలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్ లను ఆదేశించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి చూపించాకే సీల్ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో‌కి పోలింగ్ అధికారులు, ఓటర్లు సెల్ ఫోన్లు తీసుక రాకూడదని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అందుబాటులో ఉంటారని, ఓటర్లను గుర్తించిన తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలింగ్ అధికారులకు సూచించారు.

కోవిడ్ నిబంధనల ప్రకారమే పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఓటర్‌కు సింగిల్ గ్లౌజ్ అందజేయాలని, ఓటు వేసిన తర్వాత చేతి తొడుగును చెత్త కుండీలో వేసెలా చూడాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ డెస్క్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ అధికారులు బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని, మధ్యలో ఎక్కడా కూడా ఆగవద్దని అన్నారు. బ్యాలెట్ బాక్సులను కంపార్ట్ మెంట్‌లో పెట్టవద్దని, పోలింగ్ అధికారులకు ఎదురుగా పెట్టాలని సూచించారు. పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి బస్‌లో బందోబస్తుతో నేరుగా కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల‌లోని రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలన్నారు. ముందుగా ర్యాండమైజేషన్ నిర్వహించి పోలింగ్ అధికారులకు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియలో పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్ జీ.వి శ్యాం ప్రసాద్ లాల్, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, కలెక్టరేట్ ఏ.ఓ లక్ష్మారెడ్డి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed