వికటించిన మధ్యాహ్న భోజనం.. 35 మంది విద్యార్థులకు అస్వస్థత

by  |
illness for 35 students
X

దిశ, నిర్మల్ రూరల్: మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలో చోటుచేసుకుంది. మండల విద్యాధికారి ముత్యం వివరాల ప్రకారం.. మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం 114 మంది విద్యార్థులు హాజరై మధ్యాహ్న భోజనం చేశారు. అందులో దాదాపు 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనంలో కుళ్లిన కోడిగుడ్డు పెట్టడంతో ఈ విధంగా జరిగిందని, 12 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం మండల కేంద్రానికి తరలించారు. మిగతా విద్యార్థులకు పాఠశాలలోనే వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న డీఈవో రవీందర్ రెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ శ్రీకాంత్ పరిశీలించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతో పాటు మధ్యాహ్న భోజన సిబ్బందిని కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించినట్లు తెలిపారు.

Next Story