అలాగైతే జైలులో ఉండటానికే ఇష్టపడతా: దిశా రవి

by  |
అలాగైతే జైలులో ఉండటానికే ఇష్టపడతా: దిశా రవి
X

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలను అంతర్జాతీయంగా హైలైట్ చేయడం దేశద్రోహమైతే జైలులో ఉండటానికే ఇష్టపడతానని దిశా రవి శనివారం ఢిల్లీ కోర్టులో వాదించారు. టూల్ కిట్ నేరపూరితమైనదా? కాదా? అనేది ఇంకా తేలనేలేదని బెయిల్ పిటిషన్ విచారణలో దిశా రవి కౌన్సెల్ సిద్ధార్థ్ అగర్వాల్ న్యాయమూర్తులకు వినిపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చే అంతర్జాతీయ కుట్రలో దిశా రవి భాగస్వామ్యమయ్యారని ఢిల్లీ పోలీసులు వాదించారు. ఖలిస్తాన్ అనుకూల సంస్థ భారత్‌లో కుట్రకు దిశా రవిని వినియోగించుకోవాలని భావించిందని ఆరోపించారు. టూల్‌కిట్‌కు హింసకు మధ్య సంబంధమేంటని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా పోలీసుల తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు ‘ఖలిస్తానీలు అల్లర్లకు యత్నిస్తున్నారని ముందుగా కొందరు అభిప్రాయపడ్డారు. తర్వాత హింస జరిగింది. అందుకే టూల్‌కిట్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి’ అని అన్నారు.

ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని అభ్యర్థించారు. దిశా రవి బెయిల్ పిటిషన్‌పై పటియాలా హౌస్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం వెలువరించనుంది. ఆన్‌లైన్‌లో జరిగిన విచారణలో దిశా రవి తరఫు న్యాయవాది ఆమె సమాధానాన్ని చదివి వినిపించారు. సమస్య లేకుండా దిశా రవి తిరగబడదని కౌన్సెల్ అన్నారు. పర్యావరణం, రైతులకు సంబంధించిన సమస్య ముందుకొచ్చిందని, పర్యావరణానికి, సాగుకు మధ్య సంబంధమున్నదని, అందుకే దిశా రవి ఉద్యమానికి మద్దతునివ్వడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. జూమ్ మీటింగ్‌ను ఉటంకిస్తూ కలిసినవారందరిపైనా వేర్పాటువాదులనే చిహ్నాలేమీ ఉండవు కదా అని అన్నారు. టూల్ కిట్‌తోనే ట్రాక్టర్ పరేడ్‌లో హింస జరిగిందనడానికి ఆధారాల్లేవని చెప్పారు. యోగా, చాయ్ అనే అంశాలను ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారని, వాటి గురించి మాట్లాడటం నేరమా అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed