దిశ ‘ఎన్‌కౌంటర్’ నివేదిక గడువు పొడిగింపు

by  |
supreme court
X

దిశ, క్రైమ్ బ్యూరో : దేశ వ్యాప్తంగా యావత్తు ప్రజానీకాన్ని దిశ ఘటన కదిలించగా.. నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే స్థాయిలో సంచలనాత్మకంగా మారింది. 2019లో నవంబరు 27న నగర శివారు ప్రాంతంలో ప్రభుత్వ వెటర్నరీ వైద్యురాలు గ్యాంగ్ రేప్, హత్యకు గురైన సంగతి తెల్సిందే. ఈ కేసులో నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరుతో డిసెంబరు 6 తెల్లవారు జామున ఘటనా ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలీసులపై దాడి చేసి, పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను కాల్చి చంపినట్టు పోలీసులు చెబుతుండగా.. కస్టడీలో ఉన్న నిందితులను ఎన్ కౌంటర్ చేశారంటూ పలు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

ఈ ఎన్‌కౌంటర్ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయగా, పలు మహిళా సంఘాలు కేస్ డైరీ, లాగ్ బుక్స్, వెపన్ ఎంట్రీలతో పాటు ఎన్ కౌంటర్‌లో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతే కాకుండా, కాల్ డేటా వివరాలు, సెల్ ఫోన్ టవర్ లొకేషన్, నేరస్తులను తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సేకరించాలని మహిళా సంఘాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో కోరాయి. మహిళా సంఘాలు సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ మేరకు మాజీ న్యాయమూర్తి జస్టీస్ సిర్పూర్కర్ నేతృత్వంలో మరో మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఆర్పీ సోండుర్బాల్ డోటా, మాజీ సీబీఐ డైరెక్టర్ డీఆర్ కార్తీకేయన్ లతో ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేస్తూ 2019 డిసెంబరు 12 సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారించి 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో డిసెంబరు 24న కమిషన్ సభ్యులంతా నాగపూర్ లో కలుసుకుని ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. మళ్లీ మార్చి 23, 24 తేదీల్లో సమావేశం కావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా కలవలేకపోయారు. వాస్తవానికి ఈ ఘటనపై 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువును విధించింది. కానీ, కరోనా కారణంగా కమిషన్ విచారణ చేపట్టడం, కలుసుకోలేకపోవడంతో మరో 6 నెలల గడువు కావాలని కోరడంతో కమిషన్ కు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ గడువు కూడా ఈ నెలతో ముగుస్తున్నందున నివేదిక ఇచ్చేందుకు మరో 6 నెలల గడువు ఇవ్వాలని కమిషన్ మరోసారి సుప్రీంకోర్టును కోరడంతో శుక్రవారం అందుకు అంగీకరించింది.

Next Story

Most Viewed