దిశ ఎఫెక్ట్.. ప్రశ్నాపత్రాల లీక్‌లో కదులుతున్న డొంకా

by  |
దిశ ఎఫెక్ట్.. ప్రశ్నాపత్రాల లీక్‌లో కదులుతున్న డొంకా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో గత పక్షం రోజులుగా జరిగిన సమ్మేటివ్ 1 పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో డొంక కదులుతోంది. దిశ పత్రికలో ఈ నెల 18, 19 వ తేదిలలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. జిల్లా పరీక్షల విభాగం నుంచి ఫీజులు కట్టని ప్రైవేట్ పాఠశాలలకు ప్రశ్నాపత్రాలు వెళ్లాయని బాల్కొండ మండలం ఎంఈవో ఇచ్చిన రిపోర్టు ఆధారంగా జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ చర్యలకు ఉపక్రమించారు. సోమవారం డీసీఈబీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ నిశాంత్‌ను సస్పెండ్ చేశారు. బాల్కొండలోని నవీన్ పబ్లిక్ స్కూల్‌ను సీజ్ చేశారు. జిల్లా విద్యాశాఖలో జరిగిన నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించడం పై పలు విధాల వాదనలు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో నాడు పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించిన చరిత్ర ఉంది. అంతేగాకుండా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో నాడు విద్యాశాఖ క్రిమినల్ చర్యలకు సిద్దం కాగా, ప్రస్తుతం ఆలస్యంగా స్పందించడంపై అనుమానాలున్నాయి అంటున్నారు పలువురు.

ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం జిల్లా విద్యాశాఖలో కలకలం రేపింది. కరోనా కాలంలో ఆన్ లైన్ తరగతులు ఎక్కువగా జరిగి ఆఫ్ లైన్‌లో తరగతులు ఇటీవల ప్రారంభమై రెండు నెలలు గడిచాయో లేదో సమ్మేటివ్ 1 పరీక్షలు నిర్వహణ రావడం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఏ మాత్రం సమ్మతంగా లేకుండాపోయింది. కానీ విద్యాశాఖ ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలో డీసీఈబీకి ఫీజులు చెల్లించకుండా ప్రశ్నాపత్రాలను తీసుకుని వాటిని జిరాక్స్ చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో జిరాక్స్ లు తీసి పంపే క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆ సంఘటనలు కొన్ని బయటకు వచ్చాయి. దాంతో జిల్లాలో పరీక్షలకు ముందే విద్యార్థుల చెంతకు ప్రశ్నాపత్రాలు చేరాయనే వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా కొనసాగుతుంది. సోమవారం జిల్లా డీసీఈబీ సెక్రటరీ సీతయ్య ఈ మేరకు నిజామాబాద్ అదనపు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ, డీసీఈబీ కేంద్రంగా జరిగిన నిర్లక్ష్యానికి సామాన్య విద్యార్థులు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో కఠిన నిబంధనలు ఉన్న తప్పిదం ఎలా జరిగిందో తెలుసుకునే పనిలో ఆలస్యంగా స్పందించిన విద్యాశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే మండలాల విద్యాశాఖాధికారుల ద్వారా ఏయే పాఠశాలలో ప్రశ్నాపత్రాలు ముందుగా విద్యార్థులకు చేరాయని, వాటిని ఏయే పాఠశాలల నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ విద్యాశాఖ ఆధీనంలోని సర్వశిక్ష అభియాన్‌లో ఉన్న యూడైజ్ లెక్కలకు విద్యార్థుల పరీక్షల ఫీజు పొంతన లేకున్నా ఏ విధంగా ప్రశ్నాపత్రాలను జారీ చేశారో అనే అంశమే విద్యాశాఖ నిర్లక్ష్యానికి కొలమానంగా చెప్పవచ్చు.

2020లో కరోనా కారణంగా విద్యార్థులు ప్రమోట్ చేయబడినప్పుడు ఫీజులు కట్టించుకున్న డీసీఈబీ కట్టని వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 2021కి వచ్చే సరికి కరోనా థర్డ్ వేవ్‌ను బూచిగా చూపి ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహించి ఆఫ్ లైన్ ఫీజులు వసూల్ చేస్తుంటే చేతులు ముడుచుకుంది విద్యాశాఖ. ఇప్పుడు అదే యూడైజ్‌లోని వివరాల ప్రకారం.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఫీజులను చెల్లించి పరీక్షలు నిర్వహిస్తున్న ఎందుకు గుర్తించలేరంటే విద్యాశాఖాధికారుల వద్ద సమాధానమే లేదు. నిజామాబాద్ మండల విద్యాశాఖాధికారి పరిధిలో వందల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో దక్షిణ మండలం పరిధిలో సగానికి సగంపైగా పాఠశాలలు డీసీఈబీకి ఫీజులు చెల్లించకుండా జిరాక్స్ లతో పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పడానికి అధికారులు సిద్దంగా లేరు. జిల్లా విద్యాశాఖాధికారుల కార్యాలయం, మండల విద్యాశాఖాధికారుల కార్యాలయం ఉన్న అర్బన్ లోనే ఫీజులు కట్టకుండా ప్రశ్నాపత్రాలను వాట్సాప్ లలో పంపించి పరీక్షలు నిర్వహించిన వారిపై చర్యలుంటాయా? లేదా ? అనేది ఎంఈవోల నివేదిక ఆధారంగా జరుగుతుందని చెబుతున్నారు. ఎంఈవోల నివేదికలో ఏం ఉండబోతుందనేది విద్యాశాఖాధికారులే బహిర్గతం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


Next Story

Most Viewed