పవర్ బిల్లు చెల్లింపుల్లో గతేడాది మార్చి లొల్లి !

by  |
పవర్ బిల్లు చెల్లింపుల్లో గతేడాది మార్చి లొల్లి !
X

– టీఎస్ఎస్పీడీసీఎల్‌కు ట్విట్టర్‌లో కస్టమర్ల ప్రశ్నల వర్షం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి బిల్లు మొత్తాన్నే ఈ మార్చి బిల్లుగా చెల్లిస్తే సరిపోతుందన్న తెలంగాణ డిస్కంల ప్రకటనపై ట్విట్టర్‌లో వినియోగదారుల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది మార్చి నెల బిల్లును చెల్లించమనడం కాకుండా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బిల్లు ఎంతొస్తే అంతే చెల్లించమంటే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో దక్షిణ ప్రాంత డిస్కం టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉండే హైదరాబాద్ నగరంలో అద్దె ఇళ్లల్లో ఉండేవారే ఎక్కువ. వీరు చాలాసార్లు ఇళ్లు మారాల్సిన పరిస్థితి ఉంటుంది. గతేడాది మార్చిలో వీరుంటున్న ఇళ్లలో అద్దెకు ఉండి, ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్లు ఒకవేళ ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తేనే సమస్య తలెత్తుతోంది. తమకంటే ముందు టెనెంట్ల వల్ల తమకు ప్రస్తుతం అధిక బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తోందని, దానిని ప్రస్తుత లాక్‌డౌన్ టైంలో కట్టమంటే తామెక్కడినుంచి కడతామని చాలా మంది వినియోగదారులు టీఎస్ఎస్పీడీసీఎల్ ట్విట్టర్ అకౌంట్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అసలే లాక్‌డౌన్‌లో జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే, ఈ లాస్ట్ మార్చ్ కరెంటు బిల్లు గొడవేంటని వారు నేరుగా తమ ప్రశ్నల ట్వీట్లను ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు సైతం ట్యాగ్ చేస్తున్నారు. కాగా, శుక్రవారం ఒక వినియోగదారుడు ఇదే విషయమై ఎస్పీడీసీఎల్‌ను ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. ఆ సంస్థ సమాధానమిచ్చింది. ‘మీ బిల్లు చెల్లింపు తాత్కాలికమేనని, కరోనా వ్యాప్తి తగ్గి పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మార్చి అసలు విద్యుత్ వినియోగాన్ని లెక్కేసి మీ డబ్బు మీకిచ్చేస్తామని, భవిష్యత్తులో రానున్న బిల్లుల్లో సర్దుబాటు చేస్తాం’ అని తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెల విద్యుత్ వాడకంపై రీడింగ్ తీయడం కుదరదని, కస్టమర్లు గతేడాది మార్చి విద్యుత్ బిల్లునే చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

tags: corona, lockdown, telangana, discoms, power bill payment, twitter, tsspdcl

Next Story

Most Viewed