ఆ పరిశ్రమలో టెక్ నిపుణులకు భారీ డిమాండ్..

by  |
cars
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమను ఇన్‌పుట్ ఖర్చులతో పాటు టెక్ నిపుణుల కొరత కూడా వేధిస్తోంది. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల తర్వాత ఆన్‌లైన్ అమ్మకాలు పెరగడంతో ఐటీ పరిశ్రమ మాదిరిగానే ఆటో కంపెనీలు సైతం టెక్ నిపుణుల వెంట పడుతున్నాయి. సరఫరా వ్యవస్థ, ప్రొక్యూర్‌మెంట్, ఉత్పత్తి నిర్వహణ వంటి వాటిలో ఆన్‌లైన్ అమ్మకాలు పెంచేందుకు, వర్చువల్‌గా ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు భారీగా డిజిటలైజేషన్ ప్రక్రియను కంపెనీలు చేపడుతున్నాయి. కొవిడ్‌కి ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత పరిశ్రమలో డేటా సైన్స్, ఐటీ, డేటా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాలు 45 శాతం పెరిగాయని ప్రముఖ హెచ్ఆర్ సంస్థ టీమ్‌లీజ్ వెల్లడించింది.

ఇటీవల వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే వాహనాలను చూసి, కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో కంపెనీలు సైతం మారుతున్న పరిణామాలకు తగినట్టుగా డిజిటలైజేషన్‌ను పెంచుతున్నాయి. డీలర్‌షిప్‌లను డిజిటల్ రూపంలోకి మార్చడంతో పాటు వర్చువల్ అమ్మకాలను పెంచుతున్నాయి. దీనివల్ల డిజిటల్ మార్కెటింగ్, వినియోగదారు సేవల విభాగాల్లో టెక్ నిపుణులను ఎక్కువ సంఖ్యలో తీసుకుంటున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో ఆటో పరిశ్రమలో మొత్తం 18 వేల మంది టెక్ నిపుణులకు డిమాండ్ ఉన్నట్టు టీమ్‌లీజ్ తెలిపింది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పరిశ్రమలో మొత్తం 25 వేల మంది టెకీలకు డిమాండ్ ఉండనున్నట్టు వెల్లడించింది.

Next Story