భారీగా తగ్గిన వింత వ్యాధి కేసులు

by  |
భారీగా తగ్గిన వింత వ్యాధి కేసులు
X

దిశ, ఏపీబ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నాయి. వ్యాధి వ్యాపించడానికి గల కారణాలను శుక్రవారం నాటికి స్పష్టం చేయనున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చేరుకునున్నారు. ఆసుపత్రిలోని‌ భాదితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. వింత వ్యాధితో చనిపోయినట్లు వచ్చే వదంతులను నమ్మ వద్దని సీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడకు నిత్యం ఏలూరు నుంచి అనేక ఆరోగ్య సమస్యలతో వస్తుంటారని చెప్పారు. ప్రాణాంతక వ్యాధులతో వచ్చే వారికి, ఫిట్స్​వచ్చే వారికి సంబంధం లేదని పేర్కొన్నారు.

వదంతులు నమ్మొద్దు :

ప్రస్తుతం 47 మంది బాధితులు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సూపరింటెండెంట్​మోహన్​తెలిపారు. ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మృతి చెందారన్నారు. డిశ్చార్జి అయిన వారిని ఎప్పటికప్పుడు గ్రామసచివాలయ సిబ్బంది, డాక్టర్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాలుగా ఈ కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని కోరారు. ఎన్ సిడిసి, ఎన్ఐఎన్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివా లయ సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించి అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నట్లు మోహన్​వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 592 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి కోలుకుని 511 మంది డిశ్చార్జ్ అయినట్లు మోహన్​ వివరించారు.



Next Story

Most Viewed