కేసీఆర్‌-జగన్‌ల మధ్య తేడా ఇదే..!

by  |
కేసీఆర్‌-జగన్‌ల మధ్య తేడా ఇదే..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తెలంగాణలోనూ రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఉన్నా.. మాస్కు తప్పనిసరి జీఓతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిపెట్టింది. వందల సంఖ్యలో క్రమశిక్షణతో ఉండే విద్యార్థులకు స్కూళ్లను బంజేసింది. తాగితందనాలు అడే మందుబాబులకు మాత్రం మద్యం దుకాణాల గేట్లు బార్ల తెరిచింది. ఇదే సమయంలో సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్ తదితరాలను ఎక్కడ బంజేసిన దాఖాలాల్లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే ఏ ఒక్క అంశంపైనా ఆంక్షలు లేవు.

ఇందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నిక కారణమా.. లేక ఇంకేదైనా ఉందా అన్నది తేలాల్సి ఉంది. ఇదిలావుంటే.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార పర్వంలో కరోనా పాజిటివ్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. అయినా నేతలెవ్వరూ ప్రచారంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రజారోగ్యాన్ని పట్టించుకునే నాథుడే లేరు. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి సీఎం జగన్ ఎన్నికల సభను వాయిదా వేసుకుంటే.. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ లక్షలాది మంది ఎన్నికల సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది.

సభ నిర్వహిస్తే.. ప్రజారోగ్యం ఎట్లా…

హాలియాలో ఈనెల 14న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు దాదాపు లక్ష మందికి పైగా జన సమీకరణ చేసేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ హాలియాలో ఉపఎన్నిక బహిరంగ సభ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్ర సీఎం జగన్ కరోనా ముంచుకొస్తున్న సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వతహాగా సభను రద్దు చేసుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ సభను రైతులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా.. టీఆర్ఎస్ వర్గాలు మాత్రం బహిరంగ సభను నిర్వహించేందుకు పట్టుపడుతున్నారు.

ప్రచారంలోనూ అదే తీరు..

ఒక్క బహిరంగ సభ విషయంలోనూ కాదు. గత రెండు మూడు వారాలుగా నియోజకవర్గంలో నిర్వహిస్తోన్న ప్రచార తీరుపైనా విమర్శల జల్లులు కురుస్తున్నాయి. కరోనా ముప్పు పొంచి ఉన్నా.. ప్రజా శ్రేయస్సును పక్కకు నెట్టి ప్రచారం నిర్వహించడమూ ఇక్కడ చెప్పుకోదగిన విషయమే. అయితే ప్రచారంలో మాస్కులు లేకుండా జనాన్ని భారీగా సమీకరించడం.. భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా కేసులు విపరీతంగానే పెరిగాయి. చివరకు కొంతమంది నేతలకు సైతం కరోనా పాజిటివ్ వచ్చాయనే ప్రచారమూ జరిగింది. ఒక్క రోజులోనే దాదాపు 20 మంది వరకు కరోనా బయటపడింది. ఇంత ప్రమాదం పొంచి ఉన్నా.. నేతల్లో కరోనా పట్ల కించితైనా.. అప్రమత్తత లేకపోవడం గమనార్హం.



Next Story

Most Viewed