‘కేటీఆర్‌కు ఈడీ నోటీసులు.. ఢిల్లీకెళ్లిన సీఎం కేసీఆర్’

by  |
‘కేటీఆర్‌కు ఈడీ నోటీసులు.. ఢిల్లీకెళ్లిన సీఎం కేసీఆర్’
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపిందని.. ఎక్కడ జైలుకు పోతాడోనన్న భయంతో సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వేశారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో జరిగిన బీజేపీ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును కేసీఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శలు చేశారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అంటూ కొన్ని పత్రికలు కేసీఆర్ భజన చేయడం సరికాదన్నారు. ఈ విమర్శలకు చెక్ పెడుతూ.. ఢిల్లీలో కేసీఆర్ పర్యటనకు రియాక్షన్ ఇస్తూ నిర్మల్‌లో అమిత్ షా టూర్ వేశారని అర్వింద్ స్పష్టం చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక అసలు ఎన్నికే కాదని.. అక్కడ ఈటల గెలుపు ఖాయమన్నారు. రూ. 200 కోట్లు కాదు 2 వేల కోట్లు ఖర్చు చేసినా.. కేసీఆర్ పార్టీ గెలవదు అని జోస్యం చెప్పారు. హుజురాబాద్‌లో ఉన్నవారు మాత్రమే దళితులా.. ఇతర నియోజకవర్గాల్లో ఉన్నవాళ్లు కాదా అని అర్వింద్ ప్రశ్నించారు. దళితులపై సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. దళితులు ఎదగడం కేసీఆర్‌కు మింగుడు పడలేదని.. అందుకే కడియం శ్రీహరి, రాజయ్య లాంటి వాళ్ళను అణగదొక్కారన్నారు.

ఏమైనా అంటే పసుపు బోర్డు, నా గుండుపై కామెంట్ చేస్తున్నారని.. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ అంత సక్కగా ఉన్నారా అంటూ ధర్మపురి కౌంటర్ వేశారు. ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పొట్టోడు కూడా నా గురించి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2023లో రాష్ట్రంలో 100 సీట్లు సాధించి బీజేపీని అధికారంలోకి తేవడమే ప్రతి ఒక్కరు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తారా, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బానాల లక్ష్మారెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed