కొత్త ఫీచర్లతో ‘ధరణి’ పోర్టల్

by  |
కొత్త ఫీచర్లతో ‘ధరణి’ పోర్టల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన ధరణి పోర్టల్ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఆస్తి, బ్యాంకింగ్, లీగల్, జ్యుడీషియల్ ప్రొసిడింగ్స్, ట్యాక్స్ పేమెంట్స్ వంటి అంశాల్లో పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్‌కు అవకాశం కల్పించింది. అయితే జీపీఏ చేసుకునేందుకు ప్రత్యేక కారణాలు మాత్రం ఉండాల్సిందే. పట్టాదారుడు వృద్ధుడు కావడమో, విదేశాల్లో ఉండడమైతేనే వర్తిస్తుంది. ఈ క్రమంలోనే వారి ప్రాపర్టీని చూసుకునేందుకు అవకాశంగా జీపీఏదారుడికి కూడా పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు. అందులో పట్టాదారుడిగా కాకుండా ప్రిన్సిపల్‌గా పేర్కొంటారు. అలాగే ఏయే సర్వే నెంబర్లకు అధికారాలు కట్టబెడుతున్నారో పేర్కొంటారు.

జీపీఏకు విధానం

* ధరణి పోర్టల్‌లో సిటిజన్ లాగిన్‌లోకి వెళ్లాలి.
* డ్యాష్ బోర్డుపైనున్న రిజిస్ట్రేషన్ ఆఫ్ జీపీఏ మీద క్లిక్ చేయాలి.
* రిజిస్ట్రేషన్ల విధానంలో రెండు ఉంటాయి. స్థిరాస్తిని అమ్మే అధికారాన్ని కుటుంబ సభ్యులకే అప్పగిస్తూ జీపీఏ చేయడం. ఇతరులకు జీపీఏ చేయడం. రెండింట్లో ఏది సరైందో ఎంపిక చేసుకోవాలి.
* ఆ తర్వాత పట్టాదారు పాసు పుస్తకం, సర్వే నెంబర్లు వంటి వివరాలు నమోదు చేయాలి.
* ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి.
* పట్టాదారుడు ఎవరైతే జీపీఏ ఇస్తున్నారో వారి వివరాలు నమోదు చేయాలి.
* ఈ లావాదేవీ సమ్మరీ రిపోర్టును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది.
* సిటిజన్ ఈ-చలాన్, ట్రాన్సక్షన్ సమ్మరీ రిపోర్టు డౌన్‌లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి.
* నిర్దిష్ట సమయానికి ఇరుపార్టీలు వెళ్లి తహసీల్దార్ ముందు హాజరై కాన్సెంట్ ఇవ్వాలి. అప్పుడు ప్రక్రియ పూర్తవుతుంది.

కొసమెరుపు : ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది జీపీఏ, ఏజీపీఏ డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటికి ధరణి పోర్టల్ ద్వారా హక్కులు కల్పించలేదు. వాటి ఉనికి ప్రమాదంగా మారింది. ప్రత్యామ్నాయ, పరిష్కార మార్గాలను ఉన్నతాధికారులు చూపించడం లేదు. ఎంతో మంది రియల్టర్లు చేతిలో డాక్యుమెంట్లు పెట్టుకొని ఎప్పుడెలాంటి అవకాశం కల్పిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed