లాక్‌డౌన్‌లో… ఆ కేసుల సంఖ్య పెరిగింది : డీజీపీ

by  |
లాక్‌డౌన్‌లో… ఆ కేసుల సంఖ్య పెరిగింది : డీజీపీ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… అనేక జిల్లాలో 2001 సంవత్సరానికి సంబంధించిన కేసులు సైతం నేటికీ పెండింగ్‌లో ఉన్నాయని, అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

కోర్టు కేసులలో శిక్షల శాతం పెరిగి, నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన నల్లగొండ, రామగుండం ఎస్పీలను, సైబరాబాద్, రాచకొండ, రామగుండం కమిషనర్లను డీజీపీ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పని చేయాలన్నారు. సైబర్ నేరాల కేసులు పరిష్కారం కోసం అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. లాక్‌డౌన్ వల్ల సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరిగిపోయిందన్నారు. పోలీస్ అధికారులు సైబర్ నేరాలను తగ్గించడం కోసం అవసమైన సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, సిబ్బంది సంఖ్యను పెంచుతూ, సైబర్ నేరాలపై నిఘా పెంచాలని చెప్పారు.

అనంతరం నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ… నల్లగొండ జిల్లాలో 2001 సంవత్సరంలోని పెండింగ్ కేసులను క్లియర్ చేసే విధంగా జిల్లా జడ్జితో సమీక్ష నిర్వహించామని తెలిపారు. జిల్లాలో గతేడాది డిసెంబర్ 31 వరకు 4500 పెండింగ్ కేసులుండగా డీఎస్పీ, సీఐలతో పెండింగ్ కేసులపై ఎప్పటికపుడు సమీక్షించి, 1500 కేసులకు పైగా పరిష్కరించామని అన్నారు. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్యను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed