ఆ ఆలయంలో హనుమంతుడిని బేడీలతో బంధించారు.. చెప్పకుండా అక్కడికి వెళ్లినందుకే ఈ శిక్ష వేశారా..

by Disha Web Desk 20 |
ఆ ఆలయంలో హనుమంతుడిని బేడీలతో బంధించారు.. చెప్పకుండా అక్కడికి వెళ్లినందుకే ఈ శిక్ష వేశారా..
X

దిశ, ఫీచర్స్ : ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాలకు నెలవు భారత దేశం. అలాగే ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు కూడా భారతదేశంలో నెలకొన్నాయి. అలాంటి ఓ చారిత్రక దేవాలయం ఒడిస్సా లో వెలసిన పూరీ జగన్నాథ స్వామి దేవాలయం. అలాగే శ్రీరాముని భక్తుడు ఆంజనేయస్వామి దేవాలయం కూడా ఈ క్షేత్రంలో వెలసింది. ఈ హనుమాన్ దేవాలయాన్ని”దారియా మహావీర” క్షేత్రంగా పిలుస్తారు. అయితే ఈ ఆలయంలో హనుమంతున్ని సంకెళ్లతో బంధించి ఉంచుతారు. అసలు అలా ఎందుకు బంధించారు, అక్కడి స్థలపురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూరీక్షేత్రంలో జగన్నాథుడు వెలసిన అనంతరం ఆయన దర్శనం కోసం సముద్రుడు ఆ ఆలయాన్ని సందర్శించారు. అప్పుడు ఆలయంలో, ఊరంతా చేరడంతో సముద్రుడి నుంచి రక్షించమని ప్రజలు జగన్నాథుడిని ప్రార్ధించారు. ప్రజల బాధలను చూసిన జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షేత్రానికి రక్షకుడుగా ఉండే హనుమంతున్ని విచారించారు. అయితే హనుమంతుడు జగన్నాథుని అనుమతి లేకుండా అయోధ్య వెళ్ళినట్టు తెలుసుకుంటాడు.

అప్పుడు ఆగ్రహానికి గురైన జగన్నాథ స్వామి హనుమంతుని కాళ్లుచేతులను తాడుతో కట్టేశాడట. అంతే కాదట ఇకముందు అక్కడి నుంచి ఎక్కడికి కదలకుండా ఈ క్షేత్రంలో సముద్రుడు రాకుండా కాపలాకాయాలని చెప్పాడట. అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఆంజనేయుడు సంకెళ్లతో దర్శనమిస్తాడని చెబుతారు. అప్పుడే ఆ స్వామి వారికి “దరియా మహావీర” అని పేరువచ్చిందట. దారియా అంటే సముద్రం అనే అర్థం వస్తుంది. అప్పటి నుంచి వాయుపుత్రుడు పూరి నగరాన్ని రక్షిస్తున్నాడని అక్కడ ప్రజలు నమ్ముతారు. అలాగే ఈ అంజనీపుత్రున్ని “బేడీ హనుమంతుడు” అని కూడా పిలుస్తారట. హనుమంతుడు కాపలాగా ఉన్నప్పటి నుంచి నగరానికి సముద్రం ఎంత దగ్గర ఉన్నా, తుఫాను వచ్చినా ఆ నగరంలోకి సముద్రపు నీరు రాదని అక్కడి ప్రజలు చెబుతారు.



Next Story

Most Viewed