రేవంత్ ఎఫెక్ట్ : దేవరకద్ర కాంగ్రెస్‌లో కుదిరిన సయోధ్య..!

by  |
రేవంత్ ఎఫెక్ట్ : దేవరకద్ర కాంగ్రెస్‌లో కుదిరిన సయోధ్య..!
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నేతల మధ్య శనివారం సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మూడు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో పాటు ఇటీవల నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఇన్నిరోజులు నిద్ర యత్నిస్తున్న మధుసూదన్ రెడ్డి, మరో ముఖ్య నాయకుడు కాటం ప్రదీప్ గౌడ్‌ను ఉద్దేశించి కొంతమంది కార్యకర్తలతో ఫొన్లో మాట్లాడిన మాటలు బహిర్గతం అయ్యాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఉన్న విబేధాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

ఈ నియోజకవర్గ నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ శ్రేణులు చిన్నాభిన్నంగా మారారు. నేతలు ఉన్నా నియోజకవర్గంలో పార్టీపై పట్టు సాధించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అది కాస్త పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వద్దకు చేరడంతో నియోజక వర్గ నేతల మధ్య సఖ్యత చేకూర్చి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను రేవంత్ రెడ్డి డాక్టర్ మల్లురవికి అప్పగించారు. దీనితో శనివారం డాక్టర్ మల్లురవి, నియోజకవర్గ సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేద్ ఉల్లాకొత్వాల్ తదితరులు నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు వివరాలన్నింటినీ సేకరించి నేతల మధ్య సమన్వయం కుదిర్చారు. ఈ మేరకు జీఎంఆర్ ప్రదీప్ గౌడ్‌కు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రదీప్ గౌడ్, జీఎంఆర్, ప్రశాంత్ రెడ్డి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కలిసికట్టుగా పని చేస్తామని తీర్మానించారు. నియోజకవర్గంలో కార్యక్రమాలను వేర్వేరుగా కాకుండా అందరం సమన్వయంతో నిర్వహిస్తామని చెప్పడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed