లాక్‌డౌన్‌లో ఉన్నా.. కేసులు తగ్గట్లేవు

by  |
లాక్‌డౌన్‌లో ఉన్నా.. కేసులు తగ్గట్లేవు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినా.. కేసుల ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి 40 రోజులు గడుస్తున్నా.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యలో మార్పు లేకపోవడమే కాదు.. ఇంకా పెరుగుతున్నాయి కూడా. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. సింగిల్ డే‌లో కరోనా కేసులు సుమారు 2,500లకు చేరువ అవ్వడంపై ఆందోళనలు వెలువడుతున్నాయి. దినదినం కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మరీ ముఖ్యంగా ఈ మూడు నాలుగు రోజుల్లో భారీగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 2,500 కొత్త కేసులు వెలుగుచూశాయి. కేవలం కేసులే కాదు.. మరణాలు అలాగే చోటుచేసుకుంటున్నాయి. శనివారంనాడు మరణాలు 90 దరిదాపుల్లో నమోదయ్యాయి. శనివారం నాటికి దేశంలో కరోనా కేసులు 40వేలకు చేరువ కాగా.. మరణాల సంఖ్య 1,300లను దాటింది.

కొత్త హాట్‌స్పాట్‌లు లేదా అవాంఛనీయ ఘటనలేవీ చోటుచేసుకోకున్నా.. ఒక్కరోజే 2,411 కరోనా కేసులు నమోదవడం గమనార్హం. కరోనా కొత్త కేసుల ధోరణి పరిశీలిస్తే.. ఈ మహమ్మారితో విలవిల్లాడుతున్న రాష్ట్రాల్లో కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉన్నది. తొలి నుంచి కరోనాతో స్వల్పంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో తక్కువమొత్తంలోనే కేసులు నమోదవుతున్నాయి. అంటే.. అధికంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ కాలంలోనూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కేసుల్లో టాప్ 5 రాష్ట్రాల్లోనే ఈ ఉద్ధృతి అధికంగా కనిపిస్తున్నది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడులలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. శనివారంనాటి మొత్తం 2,411 కేసుల్లో మహారాష్ట్రలో 790, గుజరాత్‌లో 333, ఢిల్లీలో 384 కేసులు నమోదవడం గమనార్హం. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లోకెల్లా తమిళనాడులోనే పెద్దమొత్తంలో కేసులు వెలుగుచూస్తున్నాయి. శనివారం ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 231 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మొత్తం కేసులు 2,757. గడిచిన నాలుగు రోజుల్లో 121, 104, 161, 203 కేసులు ఈ రాష్ట్రంలో నమోదయ్యాయి. కరోనా మరణాల్లో సింహాభాగం మహారాష్ట్ర(521), గుజరాత్‌(262)ల నుంచే నమోదవుతున్నాయి. దేశంలోని మొత్తం సుమారు 39వేల కేసుల్లో మహారాష్ట్రలోనే దాదాపు 12వేల కేసులు, గుజరాత్‌లో 5వేలు, ఢిల్లీలో నాలుగువేలకుపైగా కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ రాష్ట్రాలతోపాటు పంజాబ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పుంజుకుంటున్నది. లాక్‌డౌన్ కారణంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో చిక్కుకుపోయిన సిక్కు పర్యాటకులు తిరిగి పంజాబ్‌కు తిరిగెళ్లడం.. వారిలో చాలా మందికి పాజిటివ్ తేలడంతో ఒక్కసారిగా పంజాబ్‌లో కరోనా కేసులు పెరిగాయి.

tags: coronavirus, single day, spike, highest, lockdown, cases, fatalities, country


Next Story

Most Viewed