కేసీఆర్ సార్ ‘పే స్కేల్’ అమలు చేయండి.. వీఆర్ఏల డిమాండ్

by  |
కేసీఆర్ సార్ ‘పే స్కేల్’ అమలు చేయండి.. వీఆర్ఏల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్​హామీ ప్రకారం తమకు పే స్కేలు అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్‌ను తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్​వీఆర్ఏల సంఘం శనివారం కోరింది. రెండు సార్లు తమకు సీఎం హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించారు. పే స్కేలు కల్పించాలని, సర్వీసును క్రమబద్ధీకరిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గతేడాది సెప్టెంబరు 9న అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏలకు పే స్కేలు, అర్హత ప్రకారం మూడు నెలల్లోనే అమలు చేస్తామని అన్నారు.

అసెంబ్లీలో పంచాయతీ సెక్రటరీలకు హామీ ఇవ్వకపోయినా, పీఆర్సీలో రెగ్యులర్​ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచారు. పీఆర్సీ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ వీఆర్ఏలకు 30 శాతం వేతనాలు మాత్రమే పెంచాలని నిర్ణయించడం వల్ల కేవలం రూ.14 వేలుగానే ఉందన్నారు. దీని వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ప్రార్ధించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్​పత్రికా ప్రకటన ద్వారా వివరించారు.

Next Story

Most Viewed