ఢిల్లీ టు లండన్.. ధర రూ. 15 లక్షలు

by  |
ఢిల్లీ టు లండన్.. ధర రూ. 15 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: గురుగ్రామ్‌కు చెందిన ప్రైవేట్ టూరిస్ట్ సంస్థ అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్.. వినూత్న ప్రయోగాలతో ప్రయాణికులకు ఉత్కంఠ భరితమైన సాహస యాత్రను అందుబాటులోకి తెస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే పలు అడ్వెంచర్ ట్రిప్‌లను కల్పించిన ఈ ట్రావెల్స్ సరికొత్త బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఏకంగా ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు సర్వీసును అందుబాటులోకి తెస్తూ..‘బస్ టు లండన్’ అని నామకరణం చేసింది.

అయితే, ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ బస్సు.. మొత్తం 18 దేశాల మీదుగా 20 వేల కి.మీ ప్రయాణించి లండన్‌కు చేరుకుంటుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు అందుబాటులో ఉండగా.. ప్రయాణికుల అవగాహన కోసం మరో గైడ్‌ను ఉంచనున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా లగ్జరీ సీట్లను ఏర్పాటు చేయడం కోసం 20 సీట్లను మాత్రమే నిర్మిస్తున్నారు. పైగా వారి భోజన సదుపాయం కూడా అడ్వంచర్స్ ఓవర్‌ల్యాండ్ సంస్థనే భరిస్తోంది. అలాగే, టూరిస్టులకు 4 స్టార్, 5 స్టార్ హోటళ్లలో బస కూడా ఏర్పాటు చేయనున్నారు.

కానీ, ఒక్కొక్కరికి నిర్ణయించిన టికెట్ ధర తెలిస్తే షాక్‌ అవ్వక మానరు. ఈ టూర్‌కు వచ్చే వారు ఒక్కరికీ రూ. 15 లక్షలుగా ధర నిర్ణయించడం గమనార్హం. దీంతో పాటు వారికి విసా తప్పని సరి. అయితే, ఢిల్లీ నుంచి బయల్దేరిన బస్సు మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, క‌జ‌కిస్థాన్‌, ర‌ష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్‌, చెక్ రిప‌బ్లిక్‌, జర్మనీ, నెద‌ర్లాండ్స్‌‌, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా బస్సు ప్రయాణించనుంది. చివరకు లండన్ చేరుకోనుంది.

ఈ సందర్భంగా అడ్వెంచర్స్ ఓవర్‌ల్యాండ్ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ మాట్లాడుతూ.. బస్సు ప్రయాణం అంటే ఇష్టపడే వారి కోసం ఈ ప్యాకేజీ తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. మే నెల 21 ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు.. కొవిడ్ కారణంగా నిలిపివేశామని చెప్పారు. అయితే, అన్ని దేశాల్లో కరోనా పరిస్థితులు.. ఆయా దేశాల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని తుషార్ అగర్వాల్ చెప్పారు.

Next Story

Most Viewed