టీఆర్ఎస్‌కు ధీమా సడిలిపోతోందా..?

by  |
Sagar by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పటి వరకు ఏ ఎన్నికైనా..‘‘ గెలుపు మాదే.. మేం కుక్కను పెట్టినా గెలుస్తాం.. ప్రజలు మా వైపు ఉన్నారు..” అంటూ చెప్పుకునే టీఆర్ఎస్​పార్టీ అధిష్టానంలో ధీమా సడిలిపోతుందా.. అంటే అవుననే చెప్పుతున్నాయి పార్టీ శ్రేణులు. ఎందుకంటే ఇప్పటి వరకు అభ్యర్థి ఎంపిక విషయంలో పెద్దగా పట్టించుకోని గులాబీ బాస్​ఇప్పుడు అభ్యర్థి కోసమే సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారు. సాగర్​ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. గతంలో ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు అన్ని పార్టీలు అండగా నిలిచేవి. కానీ దానికి బ్రేక్​వేసింది ఒక విధంగా టీఆర్ఎస్​పార్టే. ఎందుకంటే నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టి ఢీ కొట్టింది. కానీ అప్పుడు పరిస్థితి వేరు. టీఆర్ఎస్‌కు అంత వ్యతిరేకత బయట పడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

నిలదీస్తూ… అడ్డుకుంటూ..!

అధికార పార్టీపై రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగిందనేది ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి వచ్చింది. అందుకే పార్టీ నిర్మాణంపై అధినేత కేసీఆర్, యువరాజు కేటీఆర్​ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఎదురు చెప్పాలంటే వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు సీఎంతో సహా ఎవరినైనా నిలదీస్తున్నారు. స్థానికంగా ఉండే నేతలతో పాటు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రభుత్వ విధానాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు వ్యతిరేకతకు ఆజ్యం పోస్తున్నాయి. ఇటీవల హాలియా సభకు వెళ్లిన సీఎం కేసీఆర్​ను బహిరంగ సభలోనే నిలదీసిన విషయం రాష్ట్రమంతా చూసిందే.

సానుభూతిని వ్యతిరేకించారు

రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికే మళ్లీ ప్రాధాన్యత ఇచ్చేవారు. సానుభూతి పవనాలు వీచేవి. కానీ టీఆర్ఎస్​పార్టీ దానికి బ్రేక్​ వేసింది. ఒక విధంగా సానుభూతి అనే అంశాన్ని వ్యతిరేకించింది. నారాయణఖేడ్​, పాలేరులో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు చనిపోతే ఆ స్థానాల్లో అభ్యర్థిని దింపి, మంత్రులను మోహరించి గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు అదే టీఆర్​ఎస్​కు వ్యతిరేకమవుతోంది. ఇప్పుడు సానుభూతి అంటూ టీఆర్ఎస్ చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా… చెవికెక్కడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అది స్పష్టమైంది. సుదీర్ఘకాలం ఉద్యమంలో, పార్టీలో, ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి చనిపోతే ఆయన భార్యకు టికెట్​ఇచ్చిన టీఆర్ఎస్… అక్కడ ఫెయిల్​ అయింది.

ఇప్పుడు వెతుకులాటలో…?

సాగర్​ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అకాల మృతితో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. త్వరలోనే ఉప ఎన్నిక షెడ్యూల్​ వస్తుందని అంచనా. ఎన్నికలంటే అన్ని పార్టీల కంటే ముందు ఉండే టీఆర్ఎస్… ఇప్పుడు మాత్రం వెనకబడింది. సాగర్​లో నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వరని పార్టీ నేతలు స్పస్టంగా చెప్పుతున్నారు. అందుకే పార్టీ తరుపున ఎవరిని పోటీకి దింపాలనే సర్వేల్లో టీఆర్ఎస్​అధిష్టానం ఉంది. ఇప్పటికే రెండుసార్లు సర్వే పూర్తి చేసుకుంది. ఈ లెక్కన గతంలో ఉన్న ధీమా మొత్తం సడిలిపోయిందనేది స్పష్టం. ఒక దశలో ఇతర పార్టీల నేతలపై కూడా కన్నేయాల్సిన పరిస్థితి. అక్కడ టికెట్​రాకుంటే పిలిచి గులాబీ టికెట్​ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది. అంటే అధికార పార్టీ ఎంత మేరకు పట్టు కోల్పోతుందే అనే సంకేతాలను ఇవ్వకనే ఇస్తున్నారు.

అధిష్టానం అదే పనిలో..!

ఉప ఎన్నికలు… అందులోనూ టీఆర్ఎస్​స్థానానికి జరిగే ఎన్నికలంటే గతంలో చాలా తేలిగ్గా తీసుకునే గులాబీ దళం ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చెమటొడ్చాల్సి వస్తోంది. దుబ్బాకలో మంత్రులు, పార్టీ నేతలంతా మకాం వేశారు. జీహెచ్ఎంసీలో రాష్ట్రంలోని గులాబీ శ్రేణులంతా ప్రచారం చేశారు. కానీ ఫలితాలు మాత్రం రాలేదు. బయటకు మాత్రం ఇది గాలివాటమంటూ తేలిగ్గా తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నా… పార్టీలో మాత్రం పట్టు తప్పుతుందనే చర్చలు సాగిస్తున్నారు. అందుకే ఒక్క స్థానం కోసమైనా సీరియస్​గా ప్లాన్​ వేస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్టుగానే ఇక్కడ ఎదురుదెబ్బ తాకితే మాత్రం టీఆర్ఎస్​లో చాలా మార్పులకు అవకాశం ఉంటుందని అంచనా. పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతోందనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది బీజేపీతో టచ్​లో ఉన్నట్లు అధినేతకు సమాచారం ఉంది. అందుకే వారికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై గులాబీ పెద్ద బాస్​కేసీఆర్, చిన్నబాస్ కేటీఆర్ రాజకీయ వ్యూహాలు వేస్తున్నారు. గతంలో అపాయింట్​మెంట్​ ఇవ్వని వారికి కూడా ఇప్పుడు పిలుపించుకుని మాట్లాడుతున్నారు. సమయం దొరికితే ఫాంహౌస్​కు వెళ్లే కేసీఆర్… దాదాపు 25 రోజులు ఎటూ కదలకుండా ప్రగతిభవన్​లో మకాం వేశారు. రాజకీయాలు, మండలి ఎన్నికలపై మార్గనిర్ధేశనం చేశారు. ఇప్పుడు సాగర్​ఉప ఎన్నికలపై సమీక్షిస్తున్నారు. గతంలో జిల్లా మంత్రులపైనే భారం వేసినా… ఇప్పుడు మాత్రం అధిష్టానమే రంగంలోకి దిగుతోంది. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవని గుర్తించారు.



Next Story