త్వరలో దిగుమతి సుంకాలను తగ్గించే టెస్లా ప్రతిపాదనపై ప్రభుత్వం నిర్ణయం!

by  |
amitab kant
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్‌లో తన కార్లను ప్రవేశపెట్టేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తోందని, త్వరలో దీనిపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు.

‘ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. ఎంతమేర తగ్గించనుందనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంబంధిత శాఖలతో ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నాయని, ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తాత్కాలిక కాలానికి మూడేళ్ల పాటు దిగుమతి సుంకాలని తగ్గించే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన వివరించారు.

భారత్‌లో టెస్లా తన వాహనాలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని పలువురు అధికారులు తెలిపారు. దిగుమతి సుంకాలను తగ్గించమని కోరే బదులు టెస్లా కంపెనీ పలు విడిభాగాలను తయారు చేసేందుకు భారత్‌లో అసెంబ్లీ యూనిట్‌ను ప్రారంభించాలని, ఆ తర్వాత పూర్తిస్థాయి తయారీని చేపట్టవచ్చని భారతీయ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం భారత్‌లో విదేశీల్లోనే తయారై దిగుమతి అవుతున్న కార్లపై 60-100 శాతం సుంకం విధిస్తున్నారు. ఇంజిన్ పరిమాణం, ధర, రవాణా, బీమా అన్ని కలుపుకుని 40 వేల డాలర్లకు మించితే ఈ సుంకం వర్తిస్తుంది.


Next Story

Most Viewed