తొలిసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!

by  |
Four Years of GST
X

దిశ, వెబ్‌డెస్క్: 2020, డిసెంబర్ నెలకు సంబంధించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏడాది మొత్తానికి అత్యధికంగా రూ. 1,15,174 కోట్లతో ఏడాది ముగిసింది. అంతేకాకుండా, జీఎస్టీ విధానం అమ్మలైనప్పటి నుంచి నెలవారీగా జరిగిన వసూళ్లలో ఇవే అత్యధికం కావడం కూడా విశేషం. 2019, ఏప్రిల్ నెలలో రూ. 1,13,866 కోట్లే ఇప్పటివరకు అత్యధిక వసూళ్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా 2019, డిసెంబర్ నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్ల కంటే ఈసారి 12 శాతం వసూళ్లు పెరగడం గమనార్హం. ఇక, అంతకుముందు నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,04,936 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో వరుసగా మూడో నెల జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు వసూలయ్యాయి. ఈ క్రమంలో కొవిడ్-19 మహమ్మారి నుంచి దేశ ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలకు జీఎస్టీ వసూళ్లే రుజువని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. దీనికితోడు జీఎస్టీ విధానంలో ఉన్న లోపాలను సవరించిన కారణంగా అవకతవకలు తగ్గాయని, దీంతో జీఎస్టీ పెరిగేందుకు దోహదపడినట్టు పేర్కొంది.

‘జీఎస్టీ ఆదాయంలో రికవరీ ధోరణి కనిపిస్తోంది. అలాగే, డిసెంబర్‌లో వస్తువుల దిగుమతి నుంచి వచ్చే ఆదాయం 27 శాతం ఎక్కువగా ఉందని, దేశీయంగా లావాదేవీల ఆదాయం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 8 శాతం అధికంగా ఉందని’ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక, డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో ఐజీఎస్టీ రూ. 57,426 కోట్లు(ఇందులో దిగుమతులపై పన్నుల ద్వారా రూ. 27,050 కోట్లు ఉన్నాయి), సీజీఎస్టీ రూ. 21,365 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 27,804 కోట్లుగా నమోదయ్యాయి. ఇవికాకుండా, సెస్ రూపంలో అదనంగా రూ. 8,579 కోట్లు(ఇందులో రూ. 971 కోట్లు దిగుమతుల సుంకం ఉంది) వరకు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని సర్దుబాట్ల అనంతరం డిసెంబర్ నెలకు కేంద్రానికి రూ. 44,641 కోట్లు, రాష్ట్రాలకు రూ. 45,485 కోట్లు ఆదాయం సమకూరినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Next Story

Most Viewed