26కు చేరిన మృతుల సంఖ్య

by  |
26కు చేరిన మృతుల సంఖ్య
X

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో జల విలయానికి మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. సహాయక చర్యల్లో ఇప్పటి వరకు 26 మంది మృతదేహాలు లభించినట్టు సోమవారం రాత్రి రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, సుమారు 170 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. బురదమయమైన పవర్ ప్రాజెక్టు టన్నెల్స్ నుంచి 27 మందిని వెలికి తీసినట్టు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. తపోవన్, విష్ణుగాడ్ ప్రాజెక్టుకు చెందిన రెండు సొరంగాల నుంచి 12 మందిని, రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్ నుంచి 15 మందిని ప్రాణాలతో రక్షించినట్టు వివరించింది. నిర్మాణంలో ఉన్న పవర్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వర్కర్లతోపాటు నదుల ఉధృతికి కొట్టుకుపోయిన గ్రామస్తులను కలుపుకుని దాదాపుగా 170 మంది ఇంకా మిస్సింగ్‌లోనే ఉన్నారు.

ఐటీబీపీ, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, ఉత్తరాఖండ్ పోలీసులు, ఇతర ఏజెన్సీలు సహాయక చర్యలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు 26 మంది మృతదేహాలు లభించినట్టు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. 171 మంది వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. ఇందులో టన్నెల్‌లోనే 35 మంది గల్లంతైనట్టు వివరించారు. సహాయక చర్యల పురోగతిపై సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధుల నుంచి రూ. 20 కోట్లను రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం విడుదల చేసినట్టు సీఎంవో వెల్లడించింది.


Next Story