చాలా ప్రమాదకర దశలో ఉన్నాం.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

by  |
who director comments
X

జెనీవా: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా డెల్టా వేరియంట్ చూస్తుండగానే వంద దేశాలకు పాకింది. థర్డ్‌వేవ్‌కు కారణమవుతుందని భావిస్తున్న ‘డెల్టా’ రకం కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రపంచం చాలా ప్రమాదకర దశలో ఉంది’ అంటూ హెచ్చరింది. ఓ మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ మాట్లాడుతూ.. “మొదట భారత్‌లో వెలుగు చూసిన ఈ ‘డెల్టా’ రకం.. కొవిడ్ వైరస్‌లో అత్యంత ఆధిపత్య వేరియంట్‌గా, మిగతా వాటికంటే ప్రమాదకారిగా మారిందని తెలిపారు. ఇది క్రమంగా మరింత డేంజరస్‌గా రూపాంతరం చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఏడాదికల్లా అన్ని దేశాల్లోనూ 70శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు.

అయితే, వ్యాక్సినేషన్‌లో తీవ్ర అసమానత నెలకొన్నదని, ఇప్పటికీ అనేక పేద దేశాల్లో టీకా పంపిణీ ప్రక్రియ ఆందోళనకర స్థాయిలో ఉన్నదని వెల్లడించారు. దీన్ని అధిగమించాలంటే వ్యాక్సినేషన్‌లో అన్ని దేశాలూ పరస్పరం సహకరించుకోవాలని కోరారు. టీకా పంపిణీ కార్యక్రమంలో ఏ ఒక్క దేశం వెనుకబడినా అది ప్రపంచానికే ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది ముగిసేలోగా ప్రపంచ దేశాలన్నింటిలో 40శాతం జనాభాకు టీకాలు వేయాలని, వచ్చే ఏడాదికల్లా 70శాతానికి చేరుకోవాలని సూచించారు. అలా అయితేనే, ముప్పును ఎదుర్కోగలమని” స్పష్టం చేశారు.

Next Story