గులాబీ ఎఫెక్ట్.. గద్వాల జిల్లాలో పత్తి పంటల తొలగింపు

by  |
cotton crop
X

దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి పంటకు మొలక దశలోనే ముప్పు ఏర్పడింది. వరసగా కురుస్తున్న వర్షాలతో గులాబీ పురుగు ఉధృతంగా వ్యాపిస్తోంది. మరోవైపు సరిపడా సూర్యరశ్మి లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో గద్వాల జిల్లాకు చెందిన రైతులు పత్తి పంటలను తొలగిస్తున్నారు. కాగా, ఈ ఏడాది 80 లక్షల ఎకరాల్లో పత్తి పంట అంచనా వేయగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల వరకు రైతులు విత్తనాలు వేశారు.

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా కాసుల వర్షం కురుస్తుందని ప్రభుత్వం ఈ ఏడాది అత్యధికంగా పత్తి సాగును ప్రోత్సహించింది. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పత్తిపంటలను సాగు చేశారు. పత్తి పంటను ప్రోత్సహించిన ప్రభుత్వం పంటలో ఎదరుయ్యే సమస్యలను నివారణకు రైతులకు ఎలాంటి సూచనలు అందించలేకపోతోంది. దీంతో పంట తొలి దశలోనే గులబీ రంగు పురుగు సోకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరుస వర్షాలకు పెరుగుతున్న పురుగు

వరుస వర్షాలు పత్తి రైతులకు శాపంగా మారాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటల్లో గులాబీ పురుగు విజృంభిస్తోంది. మొలక దశలోనే పంటలను పూర్తిగా పురుగు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగు నివారణకు కావల్సిన మందులను పిచికారీ చేసినా వర్షం కురుస్తుండటంతో ఉపయోగం లేకుండా పోతోంది. సరిపడా సూర్యరశ్మి లేకపోవడం వలన పురుగు అదుపు కావడం లేదు. దీంతో చాలా వరకు పంటలు దెబ్బతింటున్నాయి.

జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో కాటన్ సీడ్ సాగు చేసిన రైతులు గులాబీ పురుగును అదుపు చేయలేక పంటలను తొలగిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు అదుపుకాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్ధితులే నెలకోనే ప్రమాదముంది. గులాబీ పురుగు నుంచి పంటలను కాపాడుకోవడానికి సరైన అవగాహనలు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రెండుసార్లు నాటిన పత్తి విత్తనాలు

cotton

పత్తి సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది మొదటల్లోనే తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చాలా మంది రైతులు ఇప్పటికే రెండుసార్లు విత్తనాలు నాటారు. ఈ సీజన్ మొదట్లో భారీగా వర్షాలు కురియడంతో జూన్ మొదటి, రెండో వారంలో పత్తి విత్తనాలను నాటారు. ఈ విత్తనాలు మొలకెత్తేందుకు జూన్ చివరి వారం నుంచి జులై మొదటి వారం వరకు సరిపడా వర్షాలు కురియకపోవడంతో రైతులు మొదటిసారి పంట నష్టపోయారు. తిరిగి జులై రెండో వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు రెండోసారి విత్తనాలను నాటారు.

ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు నమోదువుతున్నాయి. బంగాళ ఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో ఈ పరిస్థితులే కొనసాగనున్నాయి. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలు రెండో సారి నాటిన విత్తనాలను, మొలకెత్తిన పంటలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. దీంతో పంట సాగు చేసిన మొదట్లోనే పత్తి రైతులు తీవ్ర నష్టాలను మూటకట్టుకున్నారు.


Next Story

Most Viewed