దుబ్బాకలో టెన్షన్.. దళిత సంఘాల నాయకులు అరెస్ట్

by  |
దుబ్బాకలో టెన్షన్.. దళిత సంఘాల నాయకులు అరెస్ట్
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఆదివారం ఆందోళనకర వాతావరణం నెలకొంది. పట్టణానికి చెందిన వ్యాపార వేత్త నల్ల శ్రీనివాస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశాడని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దళిత సంఘాల నాయకులు శనివారం ఆయనపై దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం అందజేశారు.

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా మాట్లాడితే.. ఎంతటి వారినైనా క్షమించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దళిత, బహుజన సంఘాల ఆధ్వర్యంలో నల్ల శ్రీనివాస్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఆదివారం దుబ్బాక పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుండి నల్ల శ్రీనివాస్ ఇంటి ముట్టడికి దళిత సంఘాల నేతలు ర్యాలీగా వెళ్తుండగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారిని మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉంచినా భరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఆస ముత్యం, ఆస స్వామి, కాల్వ నరేష్, ఇల్లెందుల శ్రీనివాస్, దొమ్మాట భూపాల్, పద్మయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.



Next Story