గొప్పలు ఫుల్.. వసతులు నిల్ !

by  |
గొప్పలు ఫుల్.. వసతులు నిల్ !
X

దిశ, న్యూస్‌బ్యూరో :
కరోనా వైరస్(కోవిడ్ 19) నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో.. పనుల్లేక దినసరి కూలీలు, వలస కార్మికులు రోడ్డునపడ్డారు. ఉపాధితో పాటు కూడు, గూడుకు సైతం దూరమై రోడ్లపై అలమటిస్తున్నారు. వారికి భోజనంతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటనైతే చేసింది కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడం లేదు. రెండు మూడు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు మానవతా దృక్పథంతో వలస కార్మికులకు అన్నదానం చేశారు. అయితే, ఇటీవల కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో, పెన్షన్‌దారులకు కోతలు విధిస్తూ జీవో జారీచేయడంతో.. ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి దీనంగానే మారింది. దీంతో కార్మికులకు అన్నదానం చేసే వారి సంఖ్య తగ్గింది. మరోపక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఎలాంటి సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు ఎలాంటి సాయం చేయాల్సిన అవసరం లేదని, మమ్మల్ని మా ఊరికి పంపిస్తే అంతే చాలని కార్మికులు కోరుతుండటం గమనార్హం.

పది రోజుల నుంచి ఓ పూట తిని, మరో పూట తినక వలస కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో బాధపడకుండా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ఆ ప్రకటన చేసి ఇప్పటికే నాలుగైదు రోజులు గడుస్తున్నా.. నేటికీ దిక్కుమొక్కు లేని కార్మికులకు, యాచకులకు భద్రత కల్పించిన పరిస్థితి లేదు. మొక్కుబడిగా అక్కడక్కడా షెల్టర్లు ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ సరైన వసతులు లేవు. అంతేకాకుండా ఒకే దగ్గర వందల మందిని గుంపులు గుంపులుగా తోలడంతో.. ఆ గుంపులో ఎవరికి ఏ రోగం ఉందోనన్న భయాందోళనతో కార్మికులు యథావిధిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని చెబుతూనే, మాకు కేటాయించిన షెల్టర్లను మాత్రం గాలికొదిలేశారంటూ కార్మికులు మండిపడుతున్నారు. బాత్ రూమ్స్ కూడా లేకపోవడంతో.. అక్కడ ఉండటం కన్నా రోడ్ల పక్కన పుట్‌పాత్ పై, చెట్ల కింద తలదాచుకోవడమే మేలనిపిస్తోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు.

ఉద్యోగుల వేతనాల్లో కోత.. కార్మికులపైనా ఎఫెక్ట్

లాక్‌డౌన్ ప్రారంభం నుంచి దినసరి కూలీలకు బాసటగా నిలిచి మంచి నీళ్ల ప్యాకెట్లు, అన్నదానం చేస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఉద్యోగుల జీతాల్లో ప్రభుత్వం కోత విధించడంతో దాని ఎఫెక్ట్ లాక్‌డౌన్‌తో రోడ్ల మీదకి వచ్చి కూటికోసం ఎదురు చూస్తున్న దినసరి కూలీలు, యాచకుల మీద కూడా పడింది. ఉద్యోగులకు కేసీఆర్ షాక్‌తో.. రెండు రోజుల నుంచి అన్నదానం చేసే వారి సంఖ్య తగ్గిందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క పూట భోజనంతోనే సరిపెట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ ఎలాంటి వసతులు లేవు : నాగరాజు, దినసరి కూలీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్

నేను ఐదేండ్ల నుంచి హోటల్లో పనిచేస్తున్న. లాక్‌డౌన్‌తో హోటల్ మూసివేశారు. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డు పక్కన పుట్‌పాత్ పై తిరుగుతుంటే జీహెచ్ఎంసీ వారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. దుప్పట్లు లేవు, రాత్రి పూట దోమలతో తట్టుకోలేకపోతున్నం. ఇక్కడి కంటే బయటే బాగుంది. ప్రభుత్వం మాకు పెద్దగా ఖర్చుచేస్తున్నమని చెప్పుకుంటోంది. కానీ, మాకు చేసింది ఏమీ లేదు.

Tags: daily workers, employees, lockdown, corona virus, kcr, government, hotels


Next Story

Most Viewed