‘వద్దు భయ్యా ప్లీజ్..’ జర్నలిస్ట్‌కు దండం పెట్టిన సీపీ సజ్జనార్

by  |
‘వద్దు భయ్యా ప్లీజ్..’ జర్నలిస్ట్‌కు దండం పెట్టిన సీపీ సజ్జనార్
X

దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ది ప్రత్యేక శైలి. అత్యంత ప్రాధాన్యత, ముఖ్యమైన నేరాల దర్యాప్తు, పరిశోధనలో విభిన్నమైన పద్ధతిలో సజ్జనార్ ప్రత్యేక ముద్రను చాటుకుంటారు. ఆయనకు క్రేజీ అధికారిగా కూడా పేరుంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సజ్జనార్ కు యూత్ లో సెలబ్రిటీ ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ఈయనతో సెల్ఫీలు దిగేందుకు యూత్ పోటీ పడుతోంది.

పోలీసు శాఖలో కాస్తా దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిగా పేరున్న సజ్జనార్.. సమాజాన్ని తీవ్ర ప్రభావితం చేసిన కేసుల విచారణలోనూ అంతే సీరియస్ గా ఉంటారు. మీడియా సమావేశాల్లో జర్నలిస్టులు ఎలాంటి ప్రశ్నలు వేసినా.. ఏమాత్రం తడుముకోకుండా ఠక్కన సమాధానం చెబుతారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీస్ శాఖ, పోలీస్ అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు విమర్శలు చేసిన సమయంలోనూ అదే స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల అక్రమంగా పాస్ పోర్టులు పొందిన బంగ్లాదేశీయుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమ మార్గంలో పాస్ పోర్టులు పొందింది నిజామాబాద్ జిల్లా బోధన్ లో అయినప్పటికీ, ముగ్గురు బంగ్లాదేశీయులు శంషాబాద్ విమనాశ్రాయం నుంచే దుబాయ్ వెళ్లాలని భావించారు. కాగా వారి మాట తీరు, ప్రవర్తనతో అనుమానం కలిగిన ఇమ్మిగ్రేషన్ అధికారులు చేసిన తనిఖీల్లో అక్రమ పాస్ పోర్ట్‌ల గుట్టు రట్టయింది. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ లోని ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. సైబరాబాద్ పోలీసుల విచారణలో 72 పాస్ పోర్టు లు పొందినట్టు తేలింది. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించిన అప్ డేట్ చెప్పాలని ఓ జర్నలిస్ట్ సీపీ సజ్జనార్‌ను వివరణ కోరగా.. ‘వద్దు భయ్యా ప్లీజ్’ అంటూ దండం పెట్టాడు. దేశ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ విషయం కావడంతో మీడియాలో రచ్చ అవుతోందంటూ సావధానంగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.


Next Story

Most Viewed