ఆ తప్పు చేస్తే అకౌంట్ ఖాళీనే !

by  |
ఆ తప్పు చేస్తే అకౌంట్ ఖాళీనే !
X

దిశ, ఫీచర్స్: కరోనా అపత్కర సమయంలో కొందరు నిస్వార్థంగా కోవిడ్ బాధితులకు ఉచిత సేవలు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం బాధితుల కష్టాన్నే తమ బలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. చాలామంది బాధితులు మందులు, ఆక్సిజన్, ఆహారం కోసం సోషల్ మీడియా వేదికగా సహాయం కోరుతుండగా.. ఇదే అదనుగా ఆన్‌లైన్‌లో మోసాలు చేసేవారు రెచ్చిపోతున్నారు. దీంతో కొవిడ్ వ్యాక్సిన్, కరోనా మందులు, క్వారంటైన్ గదులు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు.. ఇలా అన్నీ ఇప్పుడు బ్లాక్ మార్కెట్ పాలవుతున్నాయి.

వ్యాక్సిన్ పేరుతో మోసాలు:

ప్రజలందరూ కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా నుంచి కాపాడుకోవచ్చనే ఆశతో ఉన్నా.. వ్యాక్సిన్స్ మాత్రం అందుబాటులో లేవు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పునాదులు వేస్తున్నారు. ‘డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నాం. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదు. వ్యాక్సిన్ యాప్‌లో మీ పేరు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ చెప్పండి. అలాగే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది కూడా చెప్పండి’ అంటూ కాల్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోన్ కాల్ నమ్మి వివారాలన్నీ చెప్పిన వారి బ్యాంకు అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. మరికొందరు సంస్థలకు, అపార్ట్‌మెంట్ వాసులకు, కుటుంబాలకు మూకుమ్మడిగా కోవిడ్‌ టీకాలు వేయిస్తామంటూ ఆన్‌లైన్‌లో పోస్టర్లు క్రియేట్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కావాలా? అంటూ కొందరు నేరుగానే ఫోన్ చేస్తున్నారు. దీంతో అపరిచితులు అమ్ముతున్న కొవిడ్ మందుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని, ఇవి ప్రాణాంతకమయ్యే ప్రమాదముందని సింబయాసిస్ సాప్ట్‌వేర్ సొల్యూషన్స్ ఎండీ నరేష్ హెచ్చరించారు.

డూప్లికేట్ యాప్స్, వెబ్‌సైట్లు

ముఖ్యంగా కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, డౌన్‌లోడ్స్‌‌పై క్లిక్‌ చేయవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మోసగాళ్లు అన‌ధికారిక వెబ్‌సైట్లు, ఫేక్ అకౌంట్‌తో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేరుతారని, మన ఫొటోలు సంపాదించి మన పేరుతోనే ఓ నకిలీ అకౌంట్ క్రియేట్ చేస్తారని చెప్తున్నారు. దాని ద్వారా మన ఫేస్‌బుక్ స్నేహితులకు రిక్వెస్ట్ వెళ్తుంది. అది మీదే అనుకుని మీ స్నేహితులు యాక్సెప్ట్ చేస్తారు. దీంతో కొన్ని రోజుల పాటు మీ ఫొటోలు, మీ పోస్టులకు లైకులు కొట్టడం, మీతో చాట్ చేయడం వంటివి చేసే అవకాశం ఉంది. తద్వారా సమాచారం షేర్ అయ్యే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అందుకే రిజిస్టర్ చేసుకుంటున్న వైబ్‌సైట్లు, యాప్స్ నిజమైనవేనా, నకిలీవా అనేది చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆధార్‌ నంబర్, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం ఎవరికీ షేర్‌ చేయవద్దని చెప్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభుత్వ వెబ్‌సైట్స్‌.. కోవిన్ పోర్టల్‌, ఆరోగ్య సేతు, UMANG మొబైల్‌ అప్లికేషన్లు మాత్రమే వాడాలని కోరుతున్నారు.


Next Story