current affairs: జాతీయం

by Disha Web Desk 17 |
current affairs: జాతీయం
X

ఆర్టెమిస్ - 1 ప్రయోగం విజయవంతం:

నాసా ప్రయోగించిన మూన్ రాకెట్ ఆర్టెమిస్ - 1 ప్రయాణం విజయవంతంగా ఆరంభమైంది.

ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఇది గాల్లోకి ఎగిరింది.

చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనదిగా చెబుతున్న ఈ రాకెట్, వ్యోమగాములు లేని, ఖాళీ ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ తో బయలుదేరింది.

జాబిల్లి కక్ష్యలోకి చేరే ఈ క్యాప్సూల్ 25 రోజుల పాటు 13 లక్షల మైళ్లు ప్రయాణిస్తుంది.

అనంతరం భూ వాతావరణం లోకి ప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది.

ఆర్టెమిస్ - 1ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించిన, ఈ చంద్రయాత్ర.. ఓరియన్ గమనాన్ని మాత్రం ఇంగ్లండ్‌లోని గూన్‌హిల్లీ ఎర్త్ స్టేషన్ నుంచి ట్రాక్ చేశారు.


2022 లో భారత వృద్ధి 7 శాతమే: మూడీస్

ప్రస్తుత ఏడాది (2022)లో భారత వృద్ధి 7 శాతానికి పరిమితం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది.

ఈ సంస్థ గత మే నెలలో వేసిన అంచనాల్లో వృద్ధి రేటు 8.8 శాతం కాగా, సెప్టెంబర్ లో 7.7 శాతానికి తగ్గించింది.

దీనిని తాజాగా సవరించి 7 శాతానికి తగ్గించింది.

అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడం వల్ల భారత ఆర్థిక కార్యకలాపాలు కూడా నెమ్మదిస్తాయని గ్లోబల్ మ్యాక్రో అవుట్ లుక్‌లో మూడీస్ వ్యక్తం చేసింది.

2023లో భారత వృద్ధి మరింత నెమ్మదించి 4.8 శాతానికి చేరుతుందని..అది 2024 తిరిగి 6.4 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది.

మూడీస్ ప్రకారం 2021లో భారత జీడీపీ వృద్ధి 8.5 శాతం.


సముద్ర భద్రతకు ఉమ్మడి కమ్యూనికేషన్ వ్యవస్థ:

తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒక ఉమ్మడి కమ్యూనికేషన్ ప్రణాళికను తీసుకురావాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

దీనివల్ల సముద్ర ప్రాంత రక్షణను పర్యవేక్షించే యంత్రాంగాలన్నీ ఒకే నెట్ వర్క్ పరిధిలోకి వస్తాయని నౌకాదళ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

వివిధ వ్యవస్థల మధ్య మెరుగైన సమన్వయానికి ఇది వీలు కల్పిస్తుంది.

కీలక సమాచార మార్పిడి నిరంతరం జరుగుతుందని వివరించారు.


దేశ చరిత్రలోనే 2020లో అత్యధిక మరణాలు:

2020, దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిపోయిన సంవత్సరం.

దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020లో 81.15 లక్షల మరణాలు నమోదయ్యాయి.

గతేడాదితో పోలిస్తే ఏకంగా 4.74 లక్షల మరణాలు అధికంగా 2020లో నమోదైనట్లు కేంద్ర జనగణన శాఖ తాజా నివేదికలో వెల్లడించింది.


జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్‌సీ) సభ్యురాలిగా నసీమా ఖాతూన్ :

బిహార్ ముజఫర్‌పుర్ లోని వేశ్యావాటికలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి, ఇప్పుడు ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) సలహా బృందంలో సభ్యురాలిగా చోటు దక్కించుకుంది.

ఆమె పేరు నసీమా ఖాతూన్ ... తన తండ్రిని ఒక వేశ్య దత్తత తీసుకోవడంతో నసీమా అక్కడే పుట్టి పెరిగింది.

వేశ్య వృత్తిలో అడుగుపెట్టకుండా .. 1995లో ఆమె జీవితం కీలక మలుపు తిరిగింది.

ఐఏఎస్ అధికారిణి రాజ్‌బాల వర్మ ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపించడంతో నసీమా కుట్లు - అల్లికలు నేర్చుకున్నారు.

అలా ఉపాధి పొంది క్రమంగా మానవ హక్కుల కార్యకర్త గా ఎదిగారు.

పర్చమ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

తాజాగా ఎన్‌హెచ్ఆర్‌సీ సలహా బృందంలో సభ్యురాలిగా అవకాశం దక్కించుకున్నారు.






Next Story