కరెంట్ అఫైర్స్ వీక్లీ: (APPSC, TSPSC ఎగ్జామ్స్ స్పెషల్)

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్ వీక్లీ: (APPSC, TSPSC ఎగ్జామ్స్ స్పెషల్)
X

కక్ష్యలోకి కెన్యా తొలి భూ పరిశీలన ఉపగ్రహం:

కెన్యా తొలి భూ పరిశీలన ఉపగ్రహం తైఫా - 1 విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. అమెరికాలోని వాండెన్‌బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ - 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. తైఫా -1 నాలుగు రోజులకు ఒకసారి కెన్యాకు ఎగువన పరిభ్రమిస్తుంది. ఇది వ్యవసాయం, నేల, పర్యావరణానికి సంబంధించిన డేటాను సేకరించి ప్రభుత్వ సంస్థలకు ఉచితంగా, ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు అందిస్తుందని కెన్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.

చైనా గగనతల రక్షణ పరీక్ష విజయవంతం:

శత్రు క్షిపణులను మార్గమధ్యలో నేలకూల్చే అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు చైనా ప్రకటించింది. దీనిని నేల నుంచి ప్రయోగించినట్లు పేర్కొంది. దీంతో అంతరిక్షం నుంచి దూసుకొచ్చే అస్త్రాలను ధ్వంసం చేసే సామర్థ్యంలో చైనా పురోగతి సాధించింది. ఈ ప్రయోగం పూర్తిగా ఆత్మరక్షణకు ఉద్దేశించినదని తెలిపింది.

G-20 అధ్యక్ష హోదా.. భారత్‌కు కీలక మలుపు:

G-20 అధ్యక్ష హోదాతో భారత్ కీలక మైలురాయిని దాటిందని, 100వ G-20 సమావేశాలు నిర్వహించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలోని 41 నగరాల్లో ఈ సమావేశాలు జరిగాయని వివరించింది. వారణాసిలో గత డిసెంబర్ 1న వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (ఎంఏసీఎస్) ప్రారంభమైందని తెలియజేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల మరో 2 సమావేశాలు జరిగాయని తెలిపింది.

అంబేద్కర్ సర్క్యూట్ భారత్ గౌరవ్ రైలు ప్రారంభం:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బోధనల స్పూర్తిని కొనసాగించడమే ఆ మహనీయుడికి ఇచ్చే ఘనమైన నివాళి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ టూరిజం సర్క్యూట్‌ను అనుసంధానం చేసే భారత్ గౌరవ్ రైలును ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్‌తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అంబేద్కర్ స్మారకం:

తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ఆవిష్కరించిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి అరుదైన గౌరవం లభించింది. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ స్మారకం నమోదైంది. సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్, సుమన్ స్మారకం వద్ద అందజేశారు. ఈ విగ్రహం హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందడం అందరికి గర్వకారణమని, రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా మారుతుందని వివరించారు.

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా నందినీ గుప్తా:

రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల నందినీ గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ - 2023 గా ఎంపికయింది. మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో జరిగిన తుది పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచింది. ఎన్నో వడపోతల తర్వాత 30 మంది తలపడిన తుది పోరులో నందిని కిరీటాన్ని దక్కించుకోగా ఢిల్లీకి చెందిన శ్రీయ పూన్జా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కి చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. తాజా గెలుపుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో తలపడే అవకాశాన్ని నందిని సంపాదించుకుంది.

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్:

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ అధ్యయనం వెల్లడించింది. పది లక్షల డాలర్లకు (మన కరెన్సీలో దాదాపు రూ. 8.2 కోట్లు) పైగా ఆస్తులు ఉన్న వ్యక్తులను మిలియనీర్లుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 97 నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా హైదరాబాద్ కు 65వ స్థానం దక్కింది. 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21 వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్ నగరం తొలి స్థానంలో నిలిచింది.

జనాభాలో భారత్ నెం.1 :

ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటివరకూ నెంబర్ 1గా నిలిచిన చైనాను దాటేసింది. మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా డాష్ బోర్డ్ ఇప్పుడు భారత్‌ను అత్యధిక జనాభా కలిగిన దేశంగా చూపిస్తోంది. భారత్‌తో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 1950 నుంచి ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల్ని ప్రచురిస్తోంది. అప్పటినుంచి అగ్రస్థానంలో చైనా కొనసాగుతోంది. తొలిసారిగా భారత్ ఈ ఏడాది అగ్రస్థానానికి చేరుకుంది. 2050 నాటికి మన జనాభా 166.8 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.


Next Story

Most Viewed