తొమ్మిది నెలల్లో భారీగా పెరిగిన నగదు చలామణీ!

by  |
తొమ్మిది నెలల్లో భారీగా పెరిగిన నగదు చలామణీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దేశీయంగా నగదు చలామణీ 13 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గణాంకాలు తెలిపాయి. గతేడాది ప్రారంభంలో కరోనా వ్యాప్తి తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ కరోనా భయంతో ప్రజలెక్కువగా నగదును చేతిలో ఉంచుకోవడానికే మొగ్గుచూపుతున్నారని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. 2020, మార్చి చివరి నాటికి దేశంలో ఉన్న నగదు చలామణీ విలువ రూ. 24,47,312 కోట్లుగా నమోదవగా, ఈ ఏడాది జనవరి 1 నాటికి నగదు చలామణీ విలువ రూ. 27,70,315 కోట్లతో 13.2 శాతం వృద్ధి నమోదైందని ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి.

గత ఆర్థిక సంవత్సరం ఇదే ఆర్థిక సంవత్సరంలో నగదు చలామణీ 6 శాతం పెరుగుదల నమోదవడం విశేషం. గతేడాది లాక్‌డౌన్ అమలయ్యాక ఎప్పుడు ఎలాంటి అవసరానికి కావాల్సి వస్తుందో అనే ఆలోచనతో ప్రజలు ముందు జాగ్రత్తలో భాగంగా నగదును తమవద్దే ఉంచుకున్నారని కేర్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవీస్ తెలిపారు. ఈ కారణంగానే నగదు చలామణీ పెరిగిందని మదన్ పేర్కొన్నారు. 2020 క్యాలెండర్ ఏడాదికి సంబంధించి నగదు చలామణీ 22.1 శాతం పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. కాగా, చలామణీలో ఉన్న మొత్తం నగదు విలువలో రూ. 500, రూ. 2,000 నోట్ల వాటా 83.4 శాతం ఉండటం విశేషం. అయితే, ఈ మధ్య కాలంలో రూ. 500 నోట్ల వాటా భారీగా పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.


Next Story