ఫ్లాష్.. ఫ్లాష్.. ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

by  |
ఫ్లాష్.. ఫ్లాష్.. ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభణ తగ్గని నేపథ్యంలో కర్ఫ్యూ పొడిగింపుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చ జరిగింది. కాగా.. ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వచ్చినప్పటికీ ఆ కర్ఫ్యూనే నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది.

ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సీఎం తెలిపినట్టు సమాచారం. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు. చిన్నారుల పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చుల కోసం వినియోగించేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. కాగా కర్ఫ్యూ పొడిగింపుపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.


Next Story

Most Viewed