పక్కాగా.. ఆ లెక్కలు పూర్తి

by  |
పక్కాగా.. ఆ లెక్కలు పూర్తి
X

దిశ, నిజామాబాద్ రూరల్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్​లో పంటలు ఆశాజనకంగా సాగయ్యాయి. ఏయే పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే లెక్క తేలింది. ఈ సంవత్సరం వర్షాలు ఆశాజనకంగా కురవడంతో ఉమ్మడి జిల్లాల వరప్రదాయినిగా ఉన్న రెండు ప్రధాన జలాశయాలు నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఈ ఏడు యాసంగిలో రెండు ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో రైతులు ఎక్కువ మొత్తంలో వరి పంటను సాగు చేశారు. జిల్లాలో 3,76,834 ఎకరాల్లో వరి సాగైంది. గత యాసంగిలో 3,18,000 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడాది అదనంగా 58,834 ఎకరాల్లో రైతులు వరి పండించారు. దీంతో వరి సాగులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే స్థానంలో నిలిచిందని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తెలిపారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాధారణ వర్షపాతం ఈ ఏడు 1042.3 మిల్లీ మీటర్లుగా నమోదు కాగా గత ఏడాది 985.5 మిల్లీ మీటర్లుగా నమోదైంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని చెరువులు, కుంటలు, చిన్న చిన్న ప్రాజెక్టులు నిండు కుండలా మారి పంటలకు ఊతం ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిజాంసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో అన్నదాతలు వరిసాగుకే ఎక్కువగా మొగ్గు చూపారు. జిల్లా వ్యవసాయ అధికారులు యాసంగిలో 3,83,000 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా వేయగా, 3,76,834 ఎకరాల్లో సాగైనట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ అధికారుల ప్రణాళిక ప్రకారం నిజాంసాగర్ ఆయకట్టుకు, ఎస్సారెస్పీ నుంచి గుత్ప అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా విడతల వారీగా నీటిని విడుదల చేసే ఆయకట్టు రైతులకు కోసం ప్రణాళిక రూపొందించారు.

తగ్గిన ఆరుతడి పంటల సాగు

ఉమ్మడి జిల్లాలో ఈసారి యాసంగిలో శనగ పంట 38.128 వేల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేసినప్పటికీ 28.128 వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగైంది. శనగ పంట బోధన్, రెంజల్, కోటగిరి, సిరికొండ, భీమ్​గల్​మండలాల్లో ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేశారు. అదేవిధంగా ఎర్రజొన్న 36.812 వేల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా, 22 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది.

వరి సాగుకే మొగ్గు చూపిన రైతులు

జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్
ఉమ్మడి జిల్లా రైతులు వరి సాగుకే మక్కువ చూపారు. ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించడంతో వరి సాగులో నిజామాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం సీజన్​కోసం యూరియా, డీఏపీ, పొటాష్, సూపర్ ఫాస్పేట్, కాంప్లెక్స్ ఎరువులను అన్ని పీఏసీఎస్ గోదాములు, ప్రైవేటు ఫర్టిలైజర్స్​లో అందుబాటులో ఉంచాం. రైతులు అధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలి.


Next Story

Most Viewed